Breaking News

పాక్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 30 మంది మృతి


పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో 30 మంది వరకు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ పాక్ ఘోట్కీలోని రేతి-ధహార్కీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం సంభవించింది. సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్, మిల్లాట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. లాహోర్‌వైపు వెళ్తోన్న రైలు.. కరాచీ నుంచి సర్గోధా వెళుతున్న మిల్లాట్ ఎక్స్‌ప్రెస్‌ రేతి-ధహార్కీ స్టేషన్‌ల మధ్య ఢీకొడంతో రైళ్లు పట్టాలు తప్పాయి. ఆగి ఉన్న మిల్లాట్ ఎక్స్‌ప్రెస్‌ను సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. మిల్లాట్ రైలు భోగీల్లో మరో 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం సాధారణంగా మారిపోయాయి. గతేడాది జులైలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందారు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని షేక్‌పురా రైల్వే క్రాసింగ్‌ వద్ద శుక్రవారం (జులై 3) మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిక్కు యాత్రికులు నంకానా సాహెబ్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంతకు ముందు ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది గాయపడ్డారు. ఇక, 2019 అక్టోబరులో తేజ్‌గమ్‌ రైలులో అగ్ని ప్రమాదం సంభవించి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయపడ్డారు.


By June 07, 2021 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-trains-collides-at-least-30-dead-in-pakistans-ghotki/articleshow/83298272.cms

No comments