Breaking News

ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల బీమా తప్పనిసరి.. స్కూల్స్ రీఓపెన్‌పై నిపుణుల కమిటీ


థర్డ్ వేవ్‌ను నిలువరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి షెట్టి నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ కీలక సూచనలు చేసింది. పిల్లలకు థర్డ్ వేవ్‌లో ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో ఒకవేళ పాఠశాలలకు విద్యార్థులు భౌతికంగా హాజరైతే ఒక్కొక్కరికీ రూ.2 లక్షల మేర ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని సూచించింది. ఈ మేరకు శనివారం సమర్పించిన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ నిరోధం.. నిర్వహణ’’ పేరుతో నివేదికను అందజేసింది. చిన్నారులకు బీమా సౌకర్యంతో ప్రత్యేక అవసరాలు, ఆరోగ్య సంరక్షణలో వివిధ అంశాలకు వర్తిస్తుందని తెలిపింది. ‘‘ఆఫ్‌లైన్ తరగతులకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా ప్రభుత్వం కల్పించాలని సిఫార్సు చేశాం.. ఇది జీవిత బీమా కాదు.. పలు దేశాలు ఇటువంటి విధానాన్నే అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. దీని వల్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం, నమ్మకం పెరిగి తమ పిల్లలను పాఠశాలలకు పంపుతారు’’ అని కమిటీలో ఓ సభ్యుడు అన్నారు. పాఠశాలలు కరోనా హాట్‌స్పాట్స్‌గా మారుతున్నట్టు ప్రపంచంలో ఎక్కడా ఆధారాల్లేవని నివేదిక తెలిపింది. ‘‘పాఠశాల పునఃప్రారంభానికి శాస్త్రీయ, ఖచ్చితమైన మార్గదర్శకాలను అందించాల్సిన అవసరం ఉంది... ఎందుకంటే పాఠశాల విద్యను సాధారణీకరించడంలో జాప్యం కోవిడ్ -19 కన్నా ఎక్కువ హానికరం’’ అని పేర్కొంది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలను పునఃప్రారంభించాల్సి ఉందన్నారు. కమిటీ అంచనాల ప్రకారం మొత్తం కర్ణాటకలోని 0-18 ఏళ్ల మధ్య పిల్లలు 2.3 కోట్ల ఉండగా.. వీరిలో 3.4 లక్షల మంది విద్యార్థులు థర్డ్ వేవ్‌లో కోవిడ్ బారినపడే అవకాశం ఉంది. వీరిలో 23,804 మంది పిల్లలకు ఆస్పత్రులు... 6,801 మందికి ఐసీయూ, 43,358 మందికి కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స అవసరమవుతుంది.. మిగతా 2.6 లక్షల మంది హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది.. 85 శాతం మంది చిన్నారుల్ల ఎటువంటి లక్షణాలు ఉండవు’’ అని తెలిపింది. రెండో దశ సమయంలో చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు రెండు వారాల పాటు 5% కన్నా తక్కువకు పడిపోయిన తర్వాత తగిన జాగ్రత్తలతో పాఠశాలలను తిరిగి తెరవవచ్చని నివేదిక రూపకల్పనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత, సరైన వెలుతురు గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ‘‘ఊహించిన దానికంటే డిజిటల్ లెర్నింగ్ లక్ష్యం తక్కువ సాధించింది.. ఇది విద్యా అసమానతలలో అంతరాలను సృష్టించింది.. చదువు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం.. పిల్లల పోషక అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది... పాఠశాల పునః ప్రారంభించడంలో జాప్యం పిల్లల్లో పోషకాహార లోపం, బాల కార్మికులు, బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణా, బిక్షాటత తదితర పరిస్థితికి దిగజార్చవచ్చు’’ అని పేర్కొంది.


By June 21, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/reopen-schools-with-2-lakhs-health-cover-for-each-kid-say-karnataka-expert-panel/articleshow/83708651.cms

No comments