Breaking News

Tehelka Editor రేప్ కేసులో నిర్దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్


అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్, జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను గోవా ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా జర్నలిస్ట్ 2013లో ఫిర్యాదు చేశారు. గోవాలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైనప్పుడు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ ఆరోపించింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చిన తేజ్‌పాల్... తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై గోవా ట్రయల్స్ కోర్టుకు కీలక సూచనలు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. విచారణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించింది. తాజాగా, తీర్పును వెలువరించిన .. తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్దోషిగా పేర్కొంది. తరుణ్ తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ తన తండ్రి తరపున ఒక ప్రకటన చదివి వినిపించారు. ‘లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేశారు.. ఈ న్యాయస్థానం కఠినమైన, నిష్పాక్షిక, న్యాయమైన విచారణ, సీసీటీవీ ఫుటేజ్, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. అలాగే, కరోనాతో చనిపోయిన తన తరఫున న్యాయవాది రాజీవ్ గోమ్స్‌కు తేజ్‌పాాల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తప్పుడు ఆరోపణలు వల్ల గత ఏడున్నరేళ్లుగా తమ కుటుంబం వేదన అనుభవించింది.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ప్రజా జీవితాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది’ అని అన్నారు. వాస్తవానికి సెషన్స్ కోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉండగా.. తౌక్టే తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శుక్రవారం తీర్పును వెలువరించింది. తెహెల్కాలో తన సీనియర్లకు సదరు మహిళా ఉద్యోగి వరుస మెయిల్స్ పంపడంతో ఆరోపణలు బయటకొచ్చాయి. దీంతో తేజ్‌పాల్ ఎడిటర్ ఇన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. నవంబరు 2013లో అరెస్ట్ కాగా.. 2014 మేలో బెయిల్‌పై బయటకు వచ్చారు.


By May 21, 2021 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/journalist-and-tehelka-founder-tarun-tejpal-acquitted-in-rape-case-by-goa-court/articleshow/82823393.cms

No comments