Breaking News

Narada Scam Case బెంగాల్ సీఎం మమతాకు సీబీఐ షాక్.. మంత్రి హకీమ్ అరెస్ట్


శారదా కుంభకోణం కేసులో పశ్చిమ్ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మమతా క్యాబినెట్‌లో ఫిర్హాద్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సోమవారం ఉదయం ఆయనను తన నివాసంలోనే అదుపులోకి తీసుకుంది. నరాడా టేపుల వ్యవహారంలో సీబీఐ అదుపులోకి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. గత ఎన్నికల ముందు బెంగాల్‌ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో మంత్రి ఫిర్హాద్ హకీమ్‌ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నరాడా టేపుల వ్యవహారంపై విచారణకు సీబీఐకి అనుమతించారు. నరాడా టేపుల కుంభకోణం కేసులో గత క్యాబినెట్‌లోని నలుగురు మంత్రుల పాత్రపై విచారణకు బీజేపీ డిమాండ్ చేయడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో అప్పటి తృణమూల్ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ కుంభకోణంపై కమిషన్ నియమించే సమయానికి సువేందు తృణమూల్ ఎంపీగా ఉన్నారు. 2014లో ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చిన ఓ జర్నలిస్ట్.. తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నారు. బెంగాల్ పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నామని, దీనికి సహకరించాలని ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ పోలీస్ అధికారికి కొంత మొత్తం ఇచ్చినట్టు టేపులు బయటకు వచ్చాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ టేపుల వ్యవహారం బెంగాల్‌ను కుదిపేసింది. ఆ తర్వాత ఇది సద్దుమణిగింది. తాజాగా, ఇప్పుడు ఈ టేపుల అంశంపై సీబీఐ విచారణకు గవర్నర్ అనుమతించి వివాదానికి తెరతీశారు. టీఎంసీ ఎమ్మెల్యే మందన్ మిత్రా, తృణమూల్‌ మాజీ నేత సోవన్ ఛటర్జీలపై విచారణకు సీబీఐకి అనుమతించారు. సోవన్ ఛటర్జీ 2019 ఆగస్టులో రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈ ఏడాది మార్చిలో బీజేపీ నుంచి బయటకొచ్చారు.


By May 17, 2021 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bengal-minister-farhid-hakim-arrested-by-cbi-in-narada-bribery-case/articleshow/82699867.cms

No comments