తౌక్టేతో కేరళ కకావికలం.. IMD రెడ్ అలర్ట్ జారీ.. ఆ రాష్ట్రాలకు యెల్లో అలర్ట్
ఆరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే’ శనివారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 18 గంటల్లో ఇది ‘అత్యంత తీవ్రమైన’ తుపానుగా మారుతుందని వివరించింది. ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్లోని పోర్బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటేప్పుడు గంటలకు 150-175 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని, కేరళ, గుజరాత్, గోవా, కొంకణ్, మహారాష్ట్రల్లోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. గుజరాత్లోని సౌరాష్ట్రలో తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందని కేంద్ర హోం శాఖ సమాచారం పంపించింది. మహారాష్ట్రలోని పాల్ఘఢ్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులకు కేరళ చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలు ఇల్లు నెలమట్టమయ్యాయి. ‘తౌక్టే’తుఫాను నేపథ్యంలో కేరళకు వాతావరణ విభాగం ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. రాగల 24 గంటల్లో తొమ్మిది జిల్లాల్లో 204 మి.మీ.కి మించి వర్షపాతం నమోదువుతుందన్న హెచ్చరికలతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. రెండు రోజుల్లో 145.5 మి.మీ.వర్షపాతం నమోదయిందని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. అటు గుజరాత్, డయ్యూ డామన్లకు యెల్లో అలర్ట్ జారీ అయ్యింది. గత ఆరు గంటల నుంచి తాక్టే గంటకు 9 కిలోమీటర్ల వేగంగా కదులుతోంది. ప్రస్తుతం తుఫాను గోవా-పనాజీకి నైరుతి దిశలో 150 కిలోమీటర్లు, ముంబయికి దక్షిణంగా 490 కిలోమీటర్లు, గుజరాత్లోని వీరావల్కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్లు, పాకిస్థాన్లోని కరాచీకి దక్షిణ-ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. వచ్చే 12 గంటల్లో ఇది పెను తుఫానుగా మారుతుందని పేర్కొంది. దాదాపు రెండు రోజుల పాటు పెను తుఫానుగా కొనసాగి.. తీరం దాటే సమయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించింది.
By May 16, 2021 at 08:44AM
No comments