Breaking News

Chipko ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూత


పర్యావరణ కార్యకర్త, సుందర్‌లాల్‌ బహుగుణ (94) కరోనాతో కన్నుమూశారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కోవిడ్ సోకిన చికిత్స కోసం మే 8న హృషీకేశ్‌లోని ఎయిమ్స్‌‌లో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి గురువారం రాత్రి విషమించింది. ఐసీయూలోనే వైద్యులు చికిత్స కొనసాగించినా ఆక్సిజన్‌ స్థాయులు క్రమంగా పడిపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రమే ఆయన భౌతిక కాయానికి హృషీకేశ్‌లోని గంగానది ఒడ్డున పూర్ణానంద ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి పార్థివ దేహాన్ని జాతీయ పతాకంతో చుట్టి పూర్ణానంద్‌ ఘాట్‌కు తరలించారు. సుందర్‌లాల్‌ బహుగుణకు భార్య విమల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె మధు ఉన్నారు. భారత తొలితరం పర్యావరణవేత్త సుందర్‌లాల్‌ బహుగుణ.. 1927 జనవరి 9న ఉత్తరాఖండ్‌లోని తెహ్రీగర్వాల్ జిల్లా మరోడా గ్రామంలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. అనంతరం రాజకీయాలవైపు ఆకర్షితులైనా 1949లో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మీరాబెన్‌, థక్కర్‌ బాపాలను కలవడంతో జీవితం మలుపు తిరిగింది. వారి స్ఫూర్తితో సామాజిక కార్యకర్తగా మారి కుల వ్యవస్థపై పోరాటం చేశారు. ఆచార్య వినోబా భావే పిలుపు 1960లో ఏడు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఈ సమయంలో సుందర్‌లాల్ బహుగుణకు పర్యావరణ సమస్యలపై ఒక అవగాహన ఏర్పడింది. దీంతో హిమాలయ పాదప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఆ క్రమంలోనే చిప్‌కో ఉద్యమాన్ని ప్రారంభించారు. అటవీ కాంట్రాక్టర్ల నుంచి చెట్లను కాపాడడానికి స్థానిక మహిళలతో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. చిప్‌కో అంటే ‘కౌగిలించుకో’ అని అర్థం. కాంట్రాక్టర్లు చెట్ల నరికివేతకు వచ్చినప్పుడు స్థానిక మహిళలంతా చెట్టు చుట్టూ మానవహారంగా ఏర్పడి అడ్డుకునేవారు. వాస్తవానికి ‘చిప్‌కో’ ఉద్యమాన్ని సుందర్‌లాల్‌ బహుగుణ కంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితమే బిష్ణోయ్‌ గిరిజన తెగలు చేపట్టారు. అయితే, ఆ ఉద్యమం గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసేలా చేసింది మాత్రం బహుగుణ. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు 1973లో 120 రోజులపాటు 1400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అలాగే, 1975లో 2,800 కిలోమీటర్లు.. 1981-1983 నడుమ కశ్మీర్‌ నుంచి కోహిమా దాకా 3,870 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చిప్‌కో ఉద్యమ మార్గదర్శిగా సుందర్‌లాల్‌ బహుగుణ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. అడవుల సంరక్షణకు గౌరీదేవి వంటి ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులతో కలిసి చిప్కో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు. 1973లో హిమాలయ పర్వత పాదాల వద్ద ఆయన మొదలుపెట్టిన ఉద్యమం.. తర్వాత కాలంలో దేశం మొత్తానికీ విస్తరించింది. ‘పర్యావరణమే శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ అనే సూత్రాన్ని విశ్వసించిన సుందర్‌లాల్‌ బహుగుణ.. దాన్నే చిప్‌కో ఉద్యమ నినాదంగా మార్చి జీవితాంతం అందుకోసమే కృషి చేశారు.


By May 22, 2021 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/environmentalist-and-chipko-movement-leade-sunderlal-bahuguna-dies-of-covid-19/articleshow/82851251.cms

No comments