Breaking News

సుప్రీంలో కేంద్రానికి ఊరట.. ఆక్సిజన్ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు ధిక్కార చర్యలు నిలిపివేత


ఢిల్లీలో ఆక్సిజన్ కొరత, కోవిడ్ పరిస్థితులపై విచారణ చేపట్టిన .. సరిపడేంత ప్రాణవాయువును అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కార చర్యలుగా భావించిన న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించారంటూ వారిపై చర్యలకు సిద్ధమవగా.. సర్వోన్నత న్యాయస్థానం బుధవారం దీనిని నిలిపివేసింది. ఉన్నతాధికారులను జైల్లో పెట్టడం వల్ల ఆక్సిజన్ రాదని, బాధితులను రక్షించేందుకు నిర్దిష్ట ప్రయత్నాలు అవసరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తాము సూచించినట్టు ఢిల్లీకి 700 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను అందించడంలో విఫలమయ్యారని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఇందుకు సంజాయిషీ చెప్పాలని కేంద్ర హోంశాఖ అడిషినల్ సెక్రెటరీ పియూష్ గోయల్, ఇండస్ట్రియల్ వాణిజ్య ప్రోత్సాహక విభాగం అదనపు కార్యదర్శి సుమితా దావ్రాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్రం పిటిషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్ షాల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు చర్యలపై స్టే విధించిన ధర్మాసనం.. అయితే కొవిడ్‌-19 పర్యవేక్షణ విషయంలో హైకోర్టును తాము అడ్డుకోబోమని విస్పష్టం చేసింది. ‘‘కరోనా దేశవ్యాప్త విపత్తు. ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తున్నా ప్రజలు చనిపోతున్నారు. వీటినెవరూ ప్రశ్నించజాలరు. కానీ, ఆక్సిజన్ అందించే విషయంలో సహకారం అవసరం. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఆక్సిజన్‌ రాదు. కేంద్ర, రాష్ట్ర అధికారులు వర్చువల్‌గా సమావేశమై... ఢిల్లీకి ఆక్సిజన్‌ను సరఫరా విషయమై చర్చించాలి. 700 టన్నుల ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాకు నివేదిక సమర్పించాలి’’ అని ధర్మాసనం సూచించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి విషయంలో సమస్య లేదని, సరఫరాకు అవసరమైన కంటైనర్ల విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయని హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘ఢిల్లీలో ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరాపై వీలైనంత కృష్టి చేస్తున్నాం.. నిపుణుల కమిటీ సిఫార్సు ప్రకారం 415 మెట్రిక్ టన్నులు అవసరం.. ఢిల్లీ ప్రభుత్వం రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూ వస్తోంది.. 400 మెట్రిక్ టన్నుల నుంచి ప్రస్తుతం 900కి చేరింది.. పెరుగుతున్న డిమాండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సరఫరా చేస్తున్నాం’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.


By May 06, 2021 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-disapproved-of-and-stayed-delhi-high-court-contempt-proceedings-against-centre/articleshow/82423052.cms

No comments