‘నీ నిస్సాహయత గురించి దేశం మొత్తం తెలుసు జగన్’ ఆ ట్వీట్పై జేఎంఎం కౌంటర్!
ప్రధాని నరేంద్ర మోదీపై ఝార్ఖండ్ సీఎం చేసిన విమర్శలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. సోరేన్ వ్యాఖ్యలపై దేశంలో మరే ఏ ముఖ్యమంత్రి ఖండించకపోయినా స్పందించారు. కాగా, జగన్ ట్వీట్పై హేమంత్ సోరేన్ పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఘాటుగానే స్పందించింది. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్కు చురకలంటించింది. అంతేకాదు, మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. ‘‘మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం వైఎస్ జగన్.. అవును, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తాం.. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ట్వీట్కు జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదాపడిన న్యూస్ను ట్యాగ్ చేసింది. ప్రధాని ఫోన్ సంభాషణ తర్వాత హేమంత్ సోరెన్ ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట (మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) మాత్రమే చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని ట్వీట్ చేశారు. హేమంత్ ట్వీట్ను ఆక్షేపిస్తూ ఏపీ సీఎం జగన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన హేమంత్ సోరెన్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’ అని పేర్కొన్నారు.
By May 08, 2021 at 09:46AM
No comments