Breaking News

కశ్మీర్: సైన్యం ఉచ్చులో ఉగ్రవాదులు.. ముగ్గురు హతం.. ఒకరు లొంగుబాటు


జమ్మూ కశ్మీర్‌లో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా.. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. బుధవారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకుని సోదాలు నిర్వహించారు. తొలుత ముష్కరులు లొంగిపోవడానికి భద్రతా బలగాలు అవకాశం ఇచ్చాయి. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. తౌనిఫ్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది లొంగిపోయాడు. ఈ నలుగురూ అల్‌ బదర్‌ ఉగ్రవాద సంస్థలో కొత్తగా చేరినట్టు భద్రతాబలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ మొదలైన తర్వాత తౌనిఫ్ అహ్మద్ లొంగిపోయినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. భద్రతా దళాలపై కాల్పులు జరిపి, గ్రనేడ్ విసిరినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బారాముల్లా జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఒకరు స్థానికుడు కాగా, ఇంకొరు విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. సోపోర్ వద్ద చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో వసీమ్ అహ్మద్ అనే వ్యక్తి కాగా.. విదేశీ ఉగ్రవాది హమాస్ అలియాస్ అస్రార్ అలియాస్ సారియా. ఇంటి నుంచి వెళ్లిపోయిన వసీమ్ అహమ్మద్ లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. హమాస్ అలియాస్ అష్రార్ 2018 మార్చి నుంచి ఉత్తర కశ్మీర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీస్ నివేదికలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ 60 మంది ఉగ్రవాదుల జాబితాలో అతడు కూడా ఉన్నాయి. ఉగ్రవాద సంస్థల్లో చేరేలా యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 29న జరిగిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీస్ కానిస్టేబుల్ హత్యలో హమాస్ పాత్ర ఉంది.


By May 06, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-one-surrenders-before-security-forces-in-shopian-in-kashmir/articleshow/82424051.cms

No comments