Breaking News

వైద్య సామాగ్రి ధరలు పెరగడానికి కారణం అదేనట.. వింత కారణం చెప్పిన చైనా!


భారత్‌లో ఏర్పడిన అధిక డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వంటి కోవిడ్ వైద్య సామాగ్రి తయారీకి వినియోగించే ముడి పదార్థాలను చైనా తయారీదారులు ఐరోపా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, అందుకే వాటి ధరలు పెరిగాయని డ్రాగన్ ప్రకటించింది. కోవిడ్ రెండో దశ వ్యాప్తితో వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌, ఔషధాలు, వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వైద్య సామాగ్రిపై పన్నులను విపరీతంగా పెంచేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ దేశం స్పందించింది. భారత్‌కు సరఫరా చేసే వైద్య సామాగ్రి ధరల పెంపుదల నిలిపివేయాలని హాంకాంగ్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రియాంక చౌహాన్ ఇటీవల చైనాకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్-19తో వైద్య సామాగ్రి కొరతను ఎదుర్కొంటున్న భారత్‌ అవసరాలను తీర్చడానికి తమ సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్‌లో ఏర్పడిన డిమాండ్‌ మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీకి ముడిపదార్థాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వైద్య సామాగ్రి ధరలు పెంచడం, ఏప్రిల్‌ 26 నుంచి సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ కార్గో విమానాలను నిలిపివేయడంతో చైనా నుంచి వైద్య పరికరాల సరఫరా నిలిచిపోయిందని ప్రియాంక చతుర్వేది ఇటీవల అన్నారు. ‘‘మీరు పేర్కొన్న ధర సమస్య విషయానికొస్తే, ఇది సరఫరా, డిమాండ్ ద్వారా నిర్ణయించిన మార్కెట్ కారకం.... ఉదహారణకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తీసుకుంటే డిమాండ్ పెరుగుదల ప్రపంచ సప్లయ్ ఛైన్‌ను ప్రభావితం చేసింది. అంతేకాకుండా, ముడిపదార్ధాల కొరత కారణంగా ఐరోపా నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో, ఉత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుంది’’ అని హువా చునింగ్ వ్యాఖ్యానించారు. ‘‘ఇంకా ఏమిటంటే, భారతీయ కొనుగోలుదారులు సాధారణంగా వివిధ ఛానెళ్ల ద్వారా ఒకే డిమాండ్ చేస్తారు.. కొన్నిసార్లు వేర్వేరు ఛానెళ్ల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.. అధిక పెరిగిన డిమాండ్‌ కొంతవరకు మార్కెట్ క్రమాన్ని ప్రభావితం చేస్తుంది.. ధరల పెరుగుదలకు కారణమవుతోంది.. 2020 తొలినాళ్లలో చైనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మాకు అదే సమస్యలు ఉత్పన్నమయ్యాయి.. అందువల్ల, సప్లయ్ ఛైన్ స్థిరంగా ఉండేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. ఇదిలా ఉండగా ఔషధాల ముడిపదార్థాల ధరలను చైనా అమాంతం రెట్టింపు చేసింది. పారాసెట్మల్‌కు సంబంధించిన ముడిసరుకు కిలో రూ.350 నుంచి రూ.900 పెంచారు. ఐవర్‌‌మెక్టిన్‌ కిలో రూ. 15 వేల నుంచి రూ.70 వేలకు, డోక్సిసైక్లయిన్‌ కిలో రూ.6 వేల నుంచి రూ.15, 500కు, అజిత్రోమైసిన్‌ డ్రగ్‌ కిలో రూ. 8,500 నుంచి రూ.14 వేలకు పెరిగింది.


By May 15, 2021 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-medical-supplies-price-hike-to-india-due-to-import-of-raw-materials-china/articleshow/82652256.cms

No comments