Breaking News

ప్రజా ప్రయోజనం దృష్ట్యా లాక్‌డౌన్ విధింపు పరిశీలించండి.. సుప్రీం కీలక ఆదేశాలు


ప్రస్తుతం దేశంలో కోవిడ్ సంక్షోభం, నెలకున్న పరిస్థితులను సుమోటాగా స్వీకరించి విచారణ చేపడుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. అంశంపై ఆదివారం రాత్రి కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ కోసం ఇబ్బందిపడుతున్నారని, దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం మిగులు నిల్వలు (బఫర్‌స్టాక్‌) ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం వాటిని నిర్వహించి దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలని తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేసి, రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ‘‘ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అవకాశాన్ని పరిశీలించండి. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే కష్టాల గురించి తెలుసు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించినట్టయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి’’ అని ధర్మాసనం సూచించింది. అలాగే, వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం పలు సూచనలు, సలహాలు చేసిన న్యాయస్థానం.. వివిధ అంశాలపై సమాచారాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం రాత్రి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ను సూపర్‌స్ప్రెడర్‌గా వ్యాపింపజేసే సామూహిక సమావేశాలు, సభలు వంటి కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలని పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వైద్యఆరోగ్య సంరక్షణ సిబ్బది బీమా క్లెయిమ్‌లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిని ఎంత కాలంలో పరిష్కరిస్తారు? అని ప్రశ్నించింది. ‘‘కరోనా బారిపడ్డ వైద్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్‌, అత్యవసర ఔషధాలు దొరకడం లేదని తెలిసింది. పాజిటివ్‌గా వచ్చిన మరికొందరిని పది రోజుల్లోపే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు... ప్రాణాలు పణంగా పెట్టి సేవలను చేస్తున్న వైద్యులను గుర్తించేందుకు వీలుగా జాతీయస్థాయిలో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి’’ అని పేర్కొంది. కోవిడ్ కట్టడికి ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలని తెలిపింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం సోషల్ మీడియా ద్వారా అర్థించే వారిని అధికారులు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. ఈ విషయం అధికార యంత్రాంగానికంతటికీ తెలిసేలా ప్రతి జిల్లా కలెక్టర్‌కు పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.


By May 03, 2021 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/consider-lockdown-to-curb-2nd-covid-wave-says-supreme-court-to-centre-states/articleshow/82365370.cms

No comments