Breaking News

ఇద్దరు ప్రియుళ్ల సాయంతో భర్త హత్య.. నేరాన్ని కరోనాపై తోసేసి నాటకం, చివరి క్షణంలో ట్విస్ట్


అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తనే కడతేర్చిందో మహిళ. పైగా తన భర్త కరోనాతో మరణించినట్లు నాటకాన్ని రక్తి కట్టించింది. చివరి క్షణంలో మృతుడి సమీప బంధువు ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడంతో ఆ కిలేడీ గుట్టు రట్టయ్యింది. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గోబి చెట్టిపాళ్యం సమీపంలోని కుమార పాళ్యంకు చెందిన శ్రీనివాసన్‌ స్థానికంగా సెలూన్‌ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య ప్రభ, కుమార్తె(10) ఉన్నారు. మంగళవారం తన భర్త శ్రీనివాసన్‌‌కు శ్వాస ఆడడం లేదని, కరోనా వచ్చినట్టు అనుమానంగా ఉందంటూ ప్రభ కన్నీరుమున్నీరైంది. ఇరుగుపొరుగు వారి సాయం కోరగా కరోనా భయంతో వారు ముందుకు రాలేదు. చివరకు ఇద్దరు వ్యక్తుల సాయంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే శ్రీనివాసన్‌‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు చెప్పారు. దీంతో తనకు సాయంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలసి ప్రభ భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో శ్రీనివాసన్‌ మరణవార్త తెలుసుకున్న ఆయన సమీప బంధువొకరు ఆస్పత్రికి వచ్చాడు. ముందు రోజు వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాసన్ సడెన్‌గా చనిపోవడంపై ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా మెడ భాగంలో గాయం కనిపించింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆస్పత్రికి వచ్చేసరికి ప్రభకు తోడుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు ప్రభను అదుపులోకి తీసుకుని విచారింగా అక్రమ సంబంధం బయటపడింది. ప్రభకు అదే ప్రాంతానికి చెందిన శరవణ కుమార్, పొరోటా వెల్లింగిరితో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా సెలూన్ మూతపడటంతో శ్రీనివాసన్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య తరుచూ ఫోన్ మాట్లాడటం, ఛాటింగ్ చేస్తుండటాన్ని గమనించి మందలించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ప్రభ తన ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.


By May 28, 2021 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-woman-killed-her-husband-and-she-plays-coronavirus-drama/articleshow/83024536.cms

No comments