కొత్త ఐటీ రూల్స్.. ట్విట్టర్ తప్పా మిగతా అన్ని సంస్థలూ అంగీకారం!
భారత ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను ట్విట్టర్ తప్పా ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్ సహా అన్ని సోషల్ మీడియా సంస్థలూ పాటించాలని అంగీకారానికి వచ్చాయని కేంద్రం శుక్రవారం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా సంస్థలు తమ నోడల్ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్ అధికారి గురించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్ మాత్రం ససేమిరా అంటోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ ఢిల్లీ హైకోర్టును వాట్సాప్ ఆశ్రయించింది. న్యాయస్థానంలో దావా వేసిన వాట్సాప్ సైతం ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పడం గమనార్హం. కానీ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ప్రమాదకరమైన నిబంధనలని ట్విట్టర్ ఆరోపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. నిబంధనల ప్రకారం భారత్లో తమ సంస్థల్లో పనిచేసే స్థానిక పౌరులను చీఫ్ కంపిలియన్స్ ఆఫీసర్లు (సీసీవో), కాంటాక్ట్ పర్సన్ (ఎన్సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. ట్విటర్ మాత్రం సీసీవో వివరాలను వెల్లడించలేదు. పైగా, ఓ సంస్థకు చెందిన న్యాయవాదిని ఎన్సీపీ, జీపీగా పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, పోలీసుల బెదిరింపు ముప్పుపై రెండు రోజుల కిందట ట్విట్టర్ ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. చట్టానికి లోబడి ఉండటానికి ప్రయత్నిస్తామన్న ట్విట్టర్.. భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనలలో మార్పులు చేయాలని కోరింది. ‘భారత్లో వర్తించే చట్టానికి లోబడి ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, ప్రతి గొంతుకను శక్తివంతం చేయాలనే నిబద్ధత.. చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తాం’’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు.
By May 29, 2021 at 08:26AM
No comments