Breaking News

మరో వేవ్‌కు సిద్ధంగా ఉండండి.. వైరస్ ఎక్కడికీ పోదు: బాంబు పేల్చిన కేంద్రం


ఊహించని విధంగా కరోనా రెండో దశ వ్యాప్తితో దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఈ విపత్తు నుంచి ఎప్పుడు బయటపడతామే తెలియని పరిస్థితి ఉండగా.. పులిమీద పుట్రలా కేంద్రం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. మరోసారి కోవిడ్ వేవ్‌కు సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రాల సమన్వయంతో జాతీయస్థాయిలో సన్నద్ధతను, మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించారు. కఠిన ఆంక్షలు విధించి, ప్రజలందరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉద్ఘాటించారు. రెండో దశ వ్యాప్తి తీవ్రతను ప్రభుత్వం అంచనా వేయలేదన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ‘‘రెండో దశ విజృంభణ ఉంటుందని పదేపదే హెచ్చరించాం. సీరో పాజిటివిటీ రేటు 20శాతంగా ఉంది కాబట్టి మిగతా 80 శాతం మందికి ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేశా.. వైరస్‌ ఎక్కడికీ పోలేదని.. ఇతర దేశాలు కూడా పలు వేవ్‌లను చూస్తున్నాయని చెప్పాం.. అయితే, పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అని వీకే పాల్‌ గుర్తుచేశారు. రెండో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉందని, కలిసికట్టుగా పోరాడుదామని మార్చి 17న ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు, రెండో దశలో కేసులు ఈ స్థాయిలో వస్తాయని తెలుసని, అలాగే వైరస్‌ మళ్లీ విజృంభిస్తుందని కూడా తెలుసని ఆయన వివరించారు. ఎవర్నీ భయపెట్టాలనే ఉద్దేశంతో ఇలా హెచ్చరించడం లేదని, పలు దేశాల్లో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించి, వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, సెకండ్‌ వేవ్‌కు డబుల్‌ మ్యుటెంట్‌ B.1.617 వేరియంట్ కారణమని కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. బి.1.617లో కొత్త రకాలైన బి.1.617.1, బి.1.617.2 ఇంకా వేగంగా వ్యాప్తి చెందేవి, ప్రాణాంతకమైనవని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ల ప్రభావశీలతపై ఈ కొత్త రకాల ప్రభావం గురించి ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. మరోవైపు, గత మూడు రోజులుగా దేశంలో రోజువారీ కేసులు, పాజిటివిటీ రేటులో స్వల్ప తగ్గుదల కనబడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కానీ, పది రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 25 శాతం కంటే ఎక్కువ ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా యాక్టివ్ కేసులు మొత్తం 12 రాష్ట్రాల్లో ఉన్నాయని, 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం ఉందన్నారు. ‘‘గోవా, పుదుచ్చేరి, పశ్చిమ్ బెంగాల్, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పాజిటివిటీ రేటు 25 శాతానికిపైగా ఉంది.. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో 20 శాతానికిపైగా ఉండటం ఆందోళనకరం’’ అని లవ్ అగర్వాల్ అన్నారు. వారం వారం చాలా జిల్లాల్లో కోవిడ్ పరీక్షలు పెంచుతున్నారని, ఏప్రిల్ 22-28 మధ్య 125గా ఉన్న పాజిటివిటీ రేటు మే 6-12 మధ్యకి 338గా ఉందన్నారు.


By May 14, 2021 at 12:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-peak-will-come-virus-can-again-emerge-warns-union-government/articleshow/82626754.cms

No comments