Breaking News

అమానుషం: ఓ కేసులో అరెస్ట్.. యువకుడితో మూత్రం తాగించిన ఎస్ఐ


ఖాకీ కర్కశత్వానికి పరాకాష్టగా నిలిచిన షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ కేసులో అదుపులోకి తీసుకున్న యువకుడితో ఎస్ఐ మూత్రం తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా గోణిబీడు గ్రామానికి చెందిన యువకుడు కేఎల్ పునీత్‌‌‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఓ యువతికి ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆరోపించారు. దీంతో అతడిని మే 10న గోణిబీడు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, కస్టడీలో తనను తీవ్రంగా కొట్టిన పోలీసులు.. తాగడానికి నీరడిగితే ఎస్ఐ అర్జున్ నిరాకరించాడని బాధితుడు ఆరోపించాడు. లాకప్‌లో ఉన్న మరో వ్యక్తి మూత్రాన్ని తనతో బలవంతంగా తాగించారని పునీత్ ఆరోపణలు చేశారు. దొంగతనం కేసు కింద అరెస్ట్ చేసి, మూత్రం తాగడానికి నిరాకరించడంతో అలా చేయకపోతే, చిత్రహింసలు పెడతామని బెదిరించారని అన్నాడు. అంతేకాదు, నేలమీద పడిన మూత్రం చుక్కలను నాకించారని తెలిపాడు. తనను నోటికొచ్చినట్టు బూతులు తిట్టారని పేర్కొన్నాడు. దీనిపై యువకుడు ఫిర్యాదు చేయడంతో చిక్కమగళూరు ఎస్పీ అక్షయ్ హాకయ్ స్పందించారు. ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదుచేసి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. బాధితుడి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు.. ఎస్‌ఐను బదిలీ చేశారు. అతడిపై శాఖాపరమై విచారణ చేపటనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దళిత యువకుడిపై పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశాయి.


By May 24, 2021 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dalit-youth-forced-to-drink-urine-by-police-in-chikkamangalore-in-karnataka/articleshow/82898149.cms

No comments