Breaking News

గుజరాత్‌లో విషాదం: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 18 మంది సజీవదహనం


గుజరాత్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. భరూచ్‌లోని కోవిడ్ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 18 మంది సజీవదహనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన సంభవించింది. ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. పటేల్ కోవిడ్ వెల్ఫేర్ సెంటర్‌లో అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. దీంతో ఈ కేంద్రంలో ఉన్న కోవిడ్ రోగుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా రోగులను పలు ఆస్పత్రులకు తరలించారు. నాలుగు అంతస్తుల ఈ భవనంలో కింది అంతస్తులో తొలుత మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ ట్రస్ట్ అధ్వరంలో ఈ కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. బాధితుల ఆర్తనాదాలు, సగం కాలిన శవాలతో ఘటనా స్థలిలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వెల్ఫేర్ కేంద్రంలోని దాదాపు 50 మంది కోవిడ్ రోగులను పలు ఆస్పత్రులకు తరలించారు. అర్ధరాత్రి 1.00 గంట సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వరకు 18 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే 12 మంది చనిపోయినట్టు గుర్తించగా.. అది 18కి చేరింది. కోవిడ్ వార్డులోని 12 మంది రోగులు ఊపిరాడక చనిపోయినట్టు భరూచ్ ఎస్పీ రాజేంద్రసిన్హా చుడాసమా అన్నారు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. భరూచ్-జంబూసర్ జాతీయ రహదారిపై ఈ సంరక్షణ కేంద్రం ఉంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గంటపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. స్థానికులు తక్షణమే స్పందించడంతో వారి సాయంతో 50 మంది రక్షించారు. ప్రస్తుతం వీరు వేర్వేరు ఆస్పత్రుల్లో ఉన్నారు.


By May 01, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/18-covid-patients-killed-in-fire-at-bharuch-hospital-in-gujrat/articleshow/82337708.cms

No comments