Breaking News

ఢిల్లీ లాక్‌డౌన్: వెంటాడుతున్న గతేడాది అనుభవం.. సొంతూళ్లకు వలస కూలీలు


కోవిడ్ రెండో దశ వ్యాప్తి దేశాన్ని వణికిస్తోంది. మహమ్మారి విజృంభించడంతో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. తాజాగా, ఢిల్లీలోనూ ఆరు రోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం లాక్‌డౌన్‌పై ప్రకటన చేయడంతో వేలాది మంది వలస కూలీలు మూటముళ్లెతో రైల్వే స్టేషన్లు, బస్టాండులకు పరుగులు పెట్టారు. గతేడాది పరిస్థితి రిపీట్ అవుతుందని, ఉపాధి కోల్పోతామనే ఆందోళనతో స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. అంతకు కొద్ది గంటల ముందు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వలస కార్మికులతో కిక్కిరిసిపోయాయి. ఆనంద్‌ విహార్ బస్ టెర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఇసుకేస్తే రాలనంతగా జనాలతో నిండిపోయాయి. వారాంతపు కర్ఫ్యూ ప్రారంభంతోనే వలస కార్మికులు తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. కానీ, సోమవారం ప్రకటనతో అత్యవసర ప్రయాణాలకు సిద్దమయ్యారు. రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్నవి పట్టుకుని పయనమయ్యారు. ఆనంద్ విహార్ టెర్మినల్ వైరస్ కేంద్రంగా మారింది. వేలాది మంది ప్రజలు నగరం నుంచి బయలు దేరగా.. ఓవర్ బ్రిడ్జిలపై కాలుపెట్టడానికి చోటు లేదు. కౌశాంబి వద్ద ఇదే పరిస్థితి. యూపీలోని పట్టణాలకు బస్సులు బయలుదేరే చోట గందరగోళానికి దారితీసింది. తమ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం టెర్మినల్‌లోకి ప్రవేశించడానికి గోడలు దూకారు. కోవిడ్ జాగ్రత్తలు గాలికి వదిలేశారు. వారం రోజులే లాక్‌డౌన్ అంటున్నారని, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సొంతూళ్లకు వెళ్లిపోవడమే ఉత్తమమని యూపీలోని ఫతేపూర్‌కు చెందిన రాజేశ్ అనే ఓ వలస కార్మికుడు అన్నాడు. తన భార్య, కుమార్తెతో వెళ్లిపోతున్న అతడు.. అక్కడ ఉంటే కనీసం కుటుంబానికి ఆహారమైనా దొరుకుతుందని పేర్కొన్నాడు. గోరఖ్‌పూర్‌కు చెందిన కార్మికులు తాము పని కోసం ఫ్యాక్టరీలకు వెళ్లామని, కానీ, తిరిగి వెళ్లిపోవాలని చెప్పారని అన్నారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా కాలినడకనే వందల కిలోమీటర్ల దూరం నడిచి సొంతూరుకు చేరామన్నారు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా నమ్మకం లేదని పేర్కొన్నారు. గతేడాది ప్రత్యేక రైళ్లు మాత్రమే నడిపాం.. ప్రస్తుత రద్దీ గతంలో లేదు.. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులనే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నామని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం 303 రైళ్లలో 4,97,500 మంది ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి 43,000 మంది ప్రయాణించారు. సోమవారం యూపీ, బిహార్‌కు చెందిన 20వేల మంది 400 బస్సుల్లో సొంతూళ్లకు తరలివెళ్లినట్టు ఆర్టీసీ అధికారి వివరించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో 600 బస్సులను అదనంగా నడపనున్నట్టు తెలిపారు.


By April 20, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/migrants-rush-to-catch-bus-train-home-fearing-repeat-of-last-year-due-to-delhi-lockdown/articleshow/82155916.cms

No comments