Breaking News

టీకా వేగవంతం.. జులై వరకూ ఆ రెండింటికి 4,500 కోట్లు చెల్లించిన కేంద్రం


వచ్చే జులై వరకూ కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన పూర్తి మొత్తాన్ని రెండు స్వదేశీ పార్మా సంస్థలకు సోమవారం చెల్లించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికార వర్గాలు తెలిపారు. వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ.3000 కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తిని కొనసాగించడానికి, పెంచడానికి అవసరమైన నిధుల మంజూరు రెండు ఫార్మా కంపెనీలకు కొనసాగించనున్నట్టు వివరించారు. ఎస్ఐఐ, భారత్ బయోటెక్‌కు తక్షణమే ఈ నిధులు చేరుతాయని ధ్రువీకరించారు. గతవారం భారత్ బయోటెక్‌ బెంగళూరు కేంద్రంలో టీకా ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించేందుకు రూ.65 కోట్ల కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ముడి పదార్థాల కొనుగోలు, సిబ్బందికి వేతనాల చెల్లింపు, వ్యాక్సిన్ డోస్‌ల తయారీ,పంపిణీ వంటి విషయంలో నిధుల కొరత ఎదుర్కొంటున్న సీరమ్, భారత్ బయోటెక్‌లకు కేంద్రం నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది. ఇటీవల వారాల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోస్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలో మూడు రోజులకు సరిపడే డోస్‌లను మాత్రమే కేంద్రం పంపిందని పంజాబ్ సోమవారం మరోసారి వెల్లడించింది. గత శుక్రవారం ఏపీ సైతం తమ వద్ద టీకా నిల్వలు పూర్తయినట్టు తెలిపింది. ఇక, మహారాష్ట్రలో టీకా కొరతతో 100 కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, కేంద్రం మాత్రం వ్యాక్సిన్ కొరత లేదని చెప్పడం గమనార్హం. పుణేలోని తన ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాలు స్పష్టంగా చెప్పాలంటే చాలా ఒత్తిడికి గురయ్యాయని సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇటీవల వ్యాఖ్యానించారు. టీకా ఉత్పత్తిని పెంచాలంటే మూడు నెలల సమయం, రూ.3,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. మే 1 నుంచి 18 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కళ్లకు టీకా అందజేయనున్నట్టు ప్రకటించిన కొద్ది సేపటికే వ్యాక్సిన్ తయారీ సంస్థలకు నిధులు మంజూరు చేయడం విశేషం. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి అవసరమయ్యే వ్యాక్సిన్ డోస్‌ల సరఫరాకే ఫార్మ సంస్థలు ఒత్తిడి ఎదుర్కొంటుండగా... తాజాగా 18 ఏళ్లు నిండినవారికి టీకా అందజేస్తామని ప్రకటించడం వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుందని అన్నారు. రాష్ట్రాలకు సరఫరాను సమన్వయం చేసుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తయారీదారుల నుంచి నేరుగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయవచ్చు. ఫార్మా సంస్థలు తమ స్టాక్‌లో 50 శాతం వరకు రాష్ట్రాలకు లేదా బహిరంగ మార్కెట్‌లో ముందుగా అంగీకరించిన ధరకు అమ్మవచ్చు. మిగతా 50 శాతం కేంద్రానికి ముందుగా నిర్ణయించిన ధరకు (డోస్ రూ.150) అందజేస్తారు. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వీటిని పంపిణీ చేస్తారు.


By April 20, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/100-advance-till-july-given-to-serum-institute-bharat-biotech-for-covid-vaccines-sources/articleshow/82155415.cms

No comments