Breaking News

చత్తీస్‌గఢ్‌లో హృదయవిదారకం.. ఆస్పత్రుల్లో గుట్టలుగా మృతదేహాలు


దేశంలో కోవిడ్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడంతో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. ఇక, చత్తీస్‌గఢ్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నవారి అంత్యక్రియలకు శ్మశనాలు దొరకడంలేదు. రాయ్‌పూర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి మృతదేహాలతో నిండిపోయింది. ఎటుచూసినా మృతదేహాలతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచడానికి కూడా ఖాళీలేదు. ఎక్కడ ఖాళీ దొరుకుందా అని ఆస్పత్రి సిబ్బంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రి అధికారులు, సిబ్బంది చేతులెత్తేశారు. కరోనాతో మరణిస్తున్న రోగుల మృతదేహాలను దహన సంస్కారాల కంటే వేగంగా మార్చురీ వద్ద గుట్టలుగా పేరుకుపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా ఇక్కడ ఐసీయూ, ఆక్సిజన్ పడకలు 100 శాతం నిండిపోయాయి. ‘‘ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో చనిపోతారని ఎవరూ ఊహించరు.. సాధారణ సమయంలో ఆస్పత్రిలో చికిత్సకు వచ్చి చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచడానికి సరిపడే ఫ్రీజర్లు ఉన్నాయి.. కానీ, ఒకటి రెంండు మరణాలున్న ప్రదేశాలలో 10-20 చోటుచేసుకుంటున్నాయి... మేము 10-20 కోసం సిద్ధం చేస్తే, 50-60 మంది చనిపోతున్నారు. ఒకేసారి చాలా మందికి ఫ్రీజర్‌లను ఎలా ఏర్పాటు చేయవచ్చు? శ్మశానవాటికలు కూడా నిండిపోయాయి’’ అని రాయ్‌పూర్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మీరా బఘేల్ పేర్కొన్నారు. ‘‘హోం ఐసోలేషన్ వంటి చర్యలతో కోవిడ్‌పై పోరాటంలో విజయానికి దగ్గరంగా ఉన్నామని భావించాం.. కానీ, మేము రెండో దశ పరిణామాన్ని ఊహించలేకపోయాం... కోవిడ్ లక్షణాలు లేని రోగుల పరిస్థితి కూడా వేగంగా క్షీణిస్తూ, గుండెపోటుతో చనిపోతున్న సందర్భాలను మేము చూస్తున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాయ్‌పూర్ నగరంలో రోజుకు సగటు 55 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. వీటిలో ఎక్కువ మంది కోవిడ్ రోగులే ఉన్నారని అధికారులు తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో సోమవారం 13,576 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 4,56,873కి చేరగా.. మరణాలు 5,031గా ఉన్నాయి. రాయ్‌పూర్, దుర్గ్ జిల్లాల్లో కోవిడ్ ఉగ్రరూపం దాల్చింది. అ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది.


By April 13, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bodies-pile-up-in-raipur-hospital-in-chhattisgarhs-covid-horror/articleshow/82042435.cms

No comments