Breaking News

జలియన్ వాలాబాగ్ దురాగతం.. సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున ఏం జరిగింది?


భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు సైతం ఉన్నారు. జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఓ తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు. అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే రౌలత్ చట్టాన్ని బ్రిటిషర్లు తీసుకురావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు. ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. మొత్తం 50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకేశారు. నిర్దాక్షిణ్యంగా వందలమంది మరణానికి కారణమైన జనరల్‌ ఓ డయ్యర్‌పై బ్రిటిష్‌ ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా బ్రిటన్‌ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించారు. ‘పంజాబ్‌ రక్షకుడు’ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ప్రతినిధుల సభలో మాత్రం డయ్యర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రూరత్వానికి ఒడిగట్టిన అతడిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి... భారత్‌లో మళ్లీ పనిచేయకుండా లండన్‌కు పంపింది. తర్వాత అతడికి ‘సర్‌’ బిరుదుతో సత్కరించింది. 1920లో హంటర్‌ కమిషన్‌ నివేదిక డయ్యర్‌ను, అప్పటి పంజాబ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అయితే, డయ్యర్‌ భారత్‌ విడిచి వెళ్లిపోయినా అతడ్ని ఉద్యమకారులు వదిలిపెట్టలేదు. మృత్యువులా వెంబడించారు. ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్‌సింగ్‌ అనే దేశభక్తుడు లండన్‌ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్‌ను హతమార్చాడు. లండన్‌లోని కాక్స్‌టన్‌ హాల్‌లో ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ సమావేశం జరిగింది. దానికి సూటూబూటు వేసుకొని హాజరైన గదర్‌ పార్టీ విప్లవ వీరుడు ఉద్దమ్‌సింగ్‌ తుపాకీతో డయ్యర్‌ను కాల్చి చంపాడు. అక్కడికక్కడే అతణ్ని అరెస్టు చేశారు.


By April 13, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jallianwala-bagh-incident-one-of-deadliest-attack-in-history-of-indias-freedom-struggle/articleshow/82042691.cms

No comments