Breaking News

కరోనాతో కన్నుమూసిన సీతారామ్ ఏచూరీ తనయుడు, జర్నలిస్ట్ ఆశిష్


సీపీఐ (ఎం) జనరల్ సెక్రెటరీ, సీనియర్ నేత సీతారామ్ ఏచూరి పెద్ద కుమారుడు అశిష్ ఏచూరీ (34) కరోనాతో కన్నుమూశాడు. కోవిడ్ బారిపడ్డ ఆశిష్.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడి మరణవార్తను స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించిన వైద్యులకు ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘‘ఈ రోజు ఉదయం నా పెద్ద కుమారుడు కోవిడ్-19తో చనిపోయాడని తెలియజేయడం చాలా బాధగా ఉంది.. మాకు ఆశలు కల్పించి, చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, కష్టకాలంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఏచూరీ ట్విట్ చేశారు. రెండు వారాల కిందట ఆశిష్‌కు కోవిడ్ నిర్దారణ కావడంతో చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్పించారు. వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో అక్కడ నుంచి గుర్గావ్‌లో మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. ఆశిష్‌ ఆరోగ్యం విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆశిష్ ఓ ప్రముఖ దినపత్రిలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆసియా, న్యూస్18లోనూ విధులు నిర్వర్తించారు.


By April 22, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cpm-leader-sitaram-yechurys-elder-son-ashish-passed-away-due-to-covid/articleshow/82191103.cms

No comments