Breaking News

ఓ మంచి పనికోసం స్టెప్పులతో ఇరగదీసిన కేరళ పోలీసులు.. వీడియో వైరల్


దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. వైరస్ మొదలై ఏడాది గడిచిపోయినా తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టలేదు. దేశంలో మహమ్మారి ప్రస్తుత విజృంభణకు కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కళ్లూ ఖచ్చితంగా పాటించకపోవడమే కారణం. అధికారులు, నిపుణులు పదే పదే చెబుతున్నా కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు చేసిన వినూత్న ప్రయత్నం నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఎంజాయి ఎంజామి’ పాటకు కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా పేరడీని రూపొందించారు. దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ చేసిన ఓ వీడియోను తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో కేరళ పోలీసులు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘‘కొవిడ్‌ వేళ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ తప్పకుండా ధరించాలి. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్క్‌ పెట్టుకోవడం కాదు. దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్‌ వెంట తీసుకువెళ్లాలి. కరోనా వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్‌ వస్తోంది. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. అందరం కలిసి కరోనా లేని భవిష్యత్తు కోసం పోరాడదాం’’ అనే సందేశంతో వీడియోను రూపొందించారు. ఒకటిన్నర నిమిషాల నిడివున్న ఈ వీడియోను ‘‘కరోనాపై కలిసిపోరాడుదాం.. కేరళ పోలీసులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు’’ అనే టైటిల్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. రెండు రోజుల కిందట ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకూ 1.3 మిలియన్ వ్యూస్.. 41 వేల లైక్స్.. 15 వేల షేర్లు వచ్చాయి. అయితే, కేరళ పోలీసులు కోవిడ్‌పై అవగాహనకు ఇటువంటి వీడియో రూపొందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలోనూ ‘హ్యాండ్ వాష్ డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలోని పాటకు స్టెప్పెలెస్తూ చేతుల శుభ్రం చేసుకోవడం గురించి అవగాహన కల్పించారు. తాజా వీడియోకు పోలీస్ మీడియా సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించగా.. హేమంత్ నాయర్, షిఫిన్ సీ రాజ్, రాజీవ్ సీపీలు కెమెరా మెన్‌లుగా వ్యవహరించారు. డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఆదిత్య ఎస్ నాయర్, రాజేష్ లాల్ వమ్షాలు స్వరాలు సమకూర్చగా.. నిలా జోసెఫ్, నహూమ్ అబ్రహామ్‌ అనే ఉద్యోగులు గీతాన్ని ఆలపించారు.


By April 30, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-polices-new-coronavirus-awareness-video-goes-viral-on-social-media/articleshow/82320305.cms

No comments