Breaking News

వేట సరదాకు నలుగురు స్నేహితులు బలి.. ఒక్కడి కోసం ముగ్గురు ఆత్మహత్య!


అడవిలో వేటకు వెళ్లిన స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు తుపాకి పేలి ప్రాణాలు కోల్పోగా.. దీనికి భయపడిపోయిన మరో ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా కుండీ గ్రామ సమీపాన అడవుల్లో ఆదివారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెహ్రీ జిల్లా భైలంగన పరిధిలోని అడవుల్లోకి ఏడుగురు స్నేహితులు శనివారం రాత్రి వేటకు వెళ్లారని తెలిపారు. తమ వెంట లోడ్‌చేసిన తుపాకిని తీసుకెళ్లారని అన్నారు. రాజీవ్ (22) అనే యువకుడు తుపాకిని పట్టుకుని నడుస్తుండగా అతడు కాలిజారి పడిపోయాడు. ఈ సమయంలోనే అతడి భుజం మీద ఉన్న గన్‌ ట్రిగ్గర్‌‌‌కు చేయి తగిలి బుల్లెట్ దూసుకెళ్లి సంతోష్ అనే మరో యువకుడికి తగలింది. బుల్లెట్ గాయానికి సంతోష్ శరీరం నుంచి రక్తం ధారాపాతంగా రావడంతో స్నేహితులు భయపడిపోయారు. అతడు కొద్దిసేపటి తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడ నుంచి రాజీవ్ పారిపోయాడు. శోభన్, పంకజ్, అర్జున్‌లు ముగ్గురూ భయానికి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. రాహుల్, సుమిత్ అనే ఇద్దరు యువకులు గ్రామంలోకి వచ్చి జరిగిన విషయం గురించి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో గ్రామస్థులు వారిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గుర్నీ చికిత్స కోసం బలేశ్వర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పంకజ్, అర్జున్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొన ఊపిరితో ఉన్న శోభన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాధితులంతా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారే కావడం బాధాకరం. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తామని తెహ్రీ జిల్లా కలెక్టర్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యిందని, మృతదేహాలకు వారి కుటుంబాలకు అందజేశామని పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి పరారైన రాజీవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


By April 05, 2021 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-on-hunting-trip-shot-by-mistake-three-others-die-by-suicide-at-tehri-forest-in-uttarkhand/articleshow/81910366.cms

No comments