Breaking News

శుభవార్త చెప్పిన ఐఎండీ.. ఈ ఏడాదీ సాధారణంగా నైరుతి రుతుపవనాలు


ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ స్థితిలోనే ఉంటాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ రెండు రోజుల కిందట అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఇదే చెప్పింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. ఏటా నైరుతికి ముందు ఏప్రిల్, మే నెలల్లో రుతుపవనాల తీరుతెన్నులపై (దీర్ఘకాలిక వ్యవధి సగటు–ఎల్‌పీఏ) అంచనాలను రూపొందిస్తుంది. ఈ ఏడాది తొలి నివేదికను ఐఎండీ శుక్రవారం విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ‘‘1961–2010 మధ్య కాలానికి దేశవ్యాప్తంగా ఎల్‌పీఏ సగటు 88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. ఎల్‌పీఏ సగటు 96-104 శాతం (అంటే ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువ) మధ్య ఉంటే ఆ ఏడాది సాధారణ వర్షపాతం కురుస్తుంది.. వచ్చే నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చు’’ అని ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. రుతుపవనాల సంభావ్యత ‘సాధారణం’ 40 శాతం కాగా, 21 శాతం ‘సాధారణం కంటే’ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2019, 2020లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపింది. గతంలో 1996,1997,1998 ఏడాదిల్లో వరుసగా మూడేళ్లు సాధారణ వర్షపాతం నమోదయ్యింది. మే చివరి వారంలో తుది నివేదికను ప్రచురించనుంది. మే 15న కేరళ తీరానికి రుతుపవనాలు ఎప్పుడు చేరుతాయనే అంచనాలు వెలువరించనుంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ మే 31 లేదా జూన్‌ మొదటి వారంలో కేరళని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి 5 నుంచి 7 రోజుల ముందే వచ్చే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోను సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మోహపాత్రా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సారి అధునాత సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అంచనాలను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న మల్టీ-మోడల్ ఎన్‌సాంబెల్ (ఎంఎంఈ)ను వినియోగించారు. ఈ విధానం వల్ల రుతపవనాలపై అంచనాల్లో లోపాలు దాదాపు తక్కువగా ఉంటాయి. కాగా, గతేడాది దేశవ్యాప్తంగా ఎల్‌పీఏలో 109 శాతం, 2019లో 110 శాతం వర్షపాతం నమోదైంది. ఎల్‌పీఏలో 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. అంటే, 2021లో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం 85 శాతం ఉందని స్కైమెట్ నివేదిక వెల్లడించింది.


By April 17, 2021 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/good-news-to-farmers-imd-predicts-normal-rainfall-in-monsoon-2021/articleshow/82112453.cms

No comments