Breaking News

రాబోయే మూడు వారాలు కీలకం.. కేసులు పెరిగేకొద్దీ కొత్త స్ట్రెయిన్‌లు: సీసీఎంబీ హెచ్చరిక


దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి భయానకంగా ఉంది. రోజువారీ కేసులు, కోవిడ్ మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కేసులు, మరణాలు పెరగడం కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం స్ట్రెయిన్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) హెచ్చరించింది. సోమవారం ఆ సంస్థ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే మూడు వారాలు అత్యంత కీలకమని.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ‘‘వైరస్‌ ఎప్పటికప్పుడు జన్యు మార్పులకు గురవుతోంది.. ఈ క్రమంలో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే.. మరికొన్ని ఎక్కువ ప్రభావం చూపుతూ వ్యాప్తి చెందుతుంటాయి.. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలపైగా కేసులు నిర్దారణ కావడంతో కొత్తరకం స్ట్రెయిన్‌లు పుట్టుకొస్తున్నాయి.. ఆయా శాంపిల్స్ నుంచి వైరస్‌ జన్యుక్రమం ఆవిష్కరించే పరిశోధనలు సాగుతున్నాయి. కొత్త రకంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉంటున్నాయా? వ్యాప్తి పెరగడానికి దోహదం చేస్తున్నాయా? అనేదానిపై పరిశీలిస్తున్నాం. B.1.617 రకం స్ట్రెయిన్ ఇతర రకాల కంటే ఎక్కువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు.. దేశవ్యాప్తంగా ఈ స్ట్రెయిన్ వ్యాప్తి ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది. E484Q, L452R మ్యుటేషన్లతోపాటు మరికొన్నిB.1.617లో ఉన్నాయి.. భారత్‌లో ఈ రకం వైరస్ అక్టోబరులో బయటపడింది. అప్పట్లో ప్రజల కోవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవడంతో వ్యాప్తి పెద్దగా లేదు... గడచిన రెండు నెలలుగా చాలామంది మాస్క్‌ లేకుండా తిరగడం, టీకా వచ్చిందని నిర్లక్ష్యంతో జాగ్రత్తలు పాటించకపోవడం వంటివి కేసులు పెరగడానికి దోహదం చేసిందని’’ అని వివరించారు. ‘‘ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.. ఇది ఇలాగే కొనసాగితే మరింత దిగజారి విపత్తుకు దారితీస్తుంది.. గతేడాది ఇటలీలో వైద్యం, ఆక్సిజన్‌ అందక చాలా మంది ఆస్పత్రుల బయటే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూశాం... మొదటి దశలో పరిస్థితిని అదుపుచేసే క్రమంలో వైద్య ఆరోగ్య కార్యకర్తలు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. వైరస్ వ్యాప్తి నెమ్మదించింది తప్పా పూర్తిగా అదుపులోకి రాలేదని భారత్‌లో రెండో దశ వ్యాప్తిపై కొన్ని నెలలుగా ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.. వ్యాక్సిన్ మాస్క్‌ ధరించాల్సిందే.. పార్టీల ర్యాలీలు, మతపరమైన వేడుకలు అత్యంత ప్రమాదకరం... వీటితోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉంది’’ అని అన్నారు. ప్రజలు తెలియకుండానే వ్యాధి బారిన పడతారు.. వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లి వైరస్‌ను చాలా గ్రామాలకు వ్యాపిస్తారు.. తద్వారా మరింత మంది కరోనా బారినపడతారు... అలాగే గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది... భవనాలు, ఇతర మూసి ఉండే ప్రదేశాల్లో 20 అడుగుల దూరం వ్యాపిస్తుంది. మాస్క్‌ ధరిస్తే 80 శాతం రక్షణ ఉంటుంది. అందరూ ధరిస్తే 99 శాతం రక్షణ లభిస్తుంది’’ అని వివరించారు.


By April 20, 2021 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-next-three-weeks-crucial-for-india-says-ccmb-director/articleshow/82155070.cms

No comments