Breaking News

భారత్‌లో కోవిడ్ ఉద్ధృతం.. బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. నేటి నుంచే అమల్లోకి!


కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌తో భూ సరిహద్దుల విషయంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు భారత్‌తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ మొమెన్‌ ప్రకటించారు. కొవిడ్‌ కారణంగా సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు మొమెన్‌ వెల్లడించారు. అయితే నిత్యావసర వస్తువుల రవాణాకు మాత్రం ఈ నిషేధం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అబ్దుల్ మొమెన్ పేర్కొన్నారు. ‘‘రెండు వారాల పాటు సరిహద్దులను మూసివేయాలని ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకున్నాం.. ఏప్రిల్ 26 నుంచి భారత్‌తో భూ సరిహద్దులను మూసివేస్తున్నాం’’అని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమాల్ మీడియాకు తెలియజేశారు. భారత్‌లో కోవిడ్ విజృంభించడంతో విమాన ప్రయాణాలపై ఏప్రిల్‌ 14 నుంచే బంగ్లాదేశ్ నిషేధం విధించింది. భారత్‌‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచి రోజుకు 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, ఎనిమిది రోజులుగా రోజుకు 2వేలకుపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2,812 మంది మృతిచెందారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకూ 1,95,118 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతవారం ఏకంగా 22 లక్షల కేసులు నిర్దారణ అయ్యాయి. యాక్టివ్ కేసులు నెల రోజుల్లోనే లక్ష నుంచి 28 లక్షలకు చేరాయి.


By April 26, 2021 at 12:15PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/bangladesh-closes-border-with-india-due-to-rising-covid-19-cases/articleshow/82254502.cms

No comments