Breaking News

భారత్‌కు సౌదీ సాయం.. 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో బయలుదేరిన నౌక


దేశంలో క‌రోనా మహోగ్రరూపం దాల్చి రోజుకు మూడు ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు, 2,000లకుపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో ఆక్సిజ‌న్ కొర‌తపై ప‌లు దేశాలు స్పందిస్తూ ప్రాణ‌వాయువును స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్రకటించాయి. భారత్‌కు సాయం ప్రకటించిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా చేరింది. భార‌త్‌కు 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతున్న‌ట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అదానీ గ్రూపు, బ్రిటన్ బహుళజాతి సంస్థ లిండే కెమికల్ కంపెనీ సహకారంతో ఈ ఆక్సిజన్‌ అందజేస్తున్నట్టు వివ‌రించింది. అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ విష‌యాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యామ‌ని అన్నారు. తాజాగా 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో నాలుగు క్రయోజనిక్‌ ట్యాంకులు స‌ముద్ర మార్గం ద్వారా దమ్మామ్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు బయలుదేరాయని వివ‌రించారు. ఆక్సిజన్ కొరత ఢిల్లీని తీవ్రంగా వేధిస్తోంది. రెండు రోజుల్లోనే ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నగరంలో రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా.. కేవలం 380 మెట్రిక్ టన్నులే సరఫరా అవుతోంది. ఆక్సిజన్ కొరతతో కొన్ని ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడంలేదు. మరికొన్ని ఆస్పత్రులు ఇప్పటికే చేరిన రోగులను డిశ్చార్జ్ చేశారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలకు ఉపక్రమించింది. జర్మనీ నుంచి 23 మెడికల్ ఆక్సిజన్ యూనిట్లను రప్పిస్తోంది.


By April 26, 2021 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-arabia-shippment-80-metric-tonnes-of-medical-oxygen-to-india/articleshow/82253931.cms

No comments