చనిపోయిన వారి డేటాతో చర్చ అనవసరం.. బీజేపీ సీఎం షాకింగ్ కామెంట్స్

దేశంలో కరోనా బారినపడి వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న సమయంలో సీఎం మనోహర్లాల్ ఖట్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చనిపోయిన వారి లెక్కలపై చర్చ వృథా అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. వాస్తవ మరణాలకు, ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్న వేళ సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చనిపోయిన వారి సంఖ్యపై చర్చ కంటే కరోనాతో పోరాడుతున్న వారికి స్వాంతన కలిగించడం ముఖ్యమని సీఎం ఖట్టర్ అభిప్రాయపడ్డారు. అయితే సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. పాలకులకు కనీసం దయ లేదని.. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కలసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం ఖట్టర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని.. రాకుండా ఉండేందుకు రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ను పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కేంద్ర కేటాయించిన 162 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను 240 టన్నులకు పెంచాలని కోరుతున్నామని.. అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. అలాగే హిసార్, పానిపట్లోని ఆక్సిజన్ ఉత్పత్రి కేంద్రాలను సీఎం సందర్శించారు. వాటికి సమీపంలోనే 500 పడకల సామర్థ్యంతో తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించాలని ఆదేశించారు. ఇప్పటికే ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారని.. మూడు నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేస్తారని ఖట్టర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిమితికి మించి కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ఆయన కోరారు. Also Read:
By April 28, 2021 at 02:43PM
No comments