Breaking News

పాక్‌లో చేజారుతున్న పరిస్థితి.. పోలీసులను బంధీలుగా చేసుకున్న ఛాందసవాదులు


అతివాద ఇస్లామిక్ గ్రూప్ చేపట్టిన ఆందోళనలతో పాకిస్థాన్‌ అట్టుడుకుతోంది. వారం రోజుల నుంచి అల్లర్లు అదుపులోకి రాలేదు. మహమ్మద్ ప్రవక్తపై వ్యంగ్యంగా కార్టూన్లు ప్రదర్శించినందుకు ఫ్రాన్స్ రాయబారులను బహిష్కరించాలంటూ ఇస్లామిక్ గ్రూప్ తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) ఏప్రిల్ 20 వరకు పాక్ ప్రభుత్వానికి గడువు విధించింది. టీఎల్పీ నేత సాద్‌ హుస్సేన్ రిజ్వీ అరెస్ట్‌తో దేశంలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారి పది మందికిపైగా చనిపోగా, 600 మంది పోలీసులు గాయపడ్డారు. తాజాగా, లాహోర్‌లో ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని ఆందోళనకారులు బందీలుగా తీసుకున్నారు. టీఎల్‌పీ వద్ద బందీలుగా ఉన్న ఎనిమిది మందిలో ఒక సీనియర్ పోలీసు అధికారి, ఇద్దరు పారామిలిటరీ సిబ్బంది ఉన్నట్టు లాహోర్ పోలీస్ అధికార ప్రతినిధి అరీఫ్ రాణా తెలిపారు. టీఎల్పీ మద్దతుదారులు వేలాది లీటర్ల పెట్రోలు ట్యాంకర్లతో వచ్చి భద్రతా సిబ్బందిపై పెట్రోలు బాంబులు విసురుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాల్పులకు కూడా తెగబడుతున్నారని ఈ ఘటనలో 11 మంది అధికారులు గాయపడ్డారని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలోనే పోలీసులు, రేంజర్లను ఆదివారం బందీలుగా తీసుకున్న టీఎల్పీ మద్దతుదారులు సాయంత్రానికి కొందర్ని వదిలిపెట్టారు. టీఎల్‌పీ అధికారి ప్రతినిధి షఫిక్ అమిని మాట్లాడుతూ.. పోలీసుల కాల్పుల్లో తమ కార్యకర్తలు నలుగురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆరోపించారు. ఫ్రెంచ్ రాయబారులను దేశం నుంచి వెళ్లగొట్టేవరకూ తమ ఆందోళనలు విరమించే ప్రసక్తేలేదని టీఎల్పీ నేత అల్లామా మొహమూద్ షఫీక్ అమినీ స్పష్టం చేశారు. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతుంటే పోలీసులే తమపై దాడిచేశారని మండిపడ్డారు. పంజాబ్ ప్రావిన్సుల ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫిర్దోయుస్ అషిక్ అవన్ మాట్లాడుతూ.. 12 మంది భద్రతా సిబ్బందిని అపహరించిన ఆందోళనకారులు లాహోర్‌లోని టీఎల్పీ మసీదులో బంధించారని తెలిపారు. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో తమ పౌరులంతా తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని ఫ్రెంచ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తామ శుక్రవారం ప్రార్థనల అనంతరం హింస మరింత ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని భావించిన పాక్ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సామాజిక మాధ్యమాలను నిషేధించింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ సహా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించి, ఇంటర్నెట్‌ను సైతం నిలిపివేసింది.


By April 19, 2021 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/police-and-rangers-taken-hostage-in-anti-france-protests-in-pakistan/articleshow/82139570.cms

No comments