Breaking News

‘సారీ.. అవి టీకాలని తెలియదు’.. హిందీలో లేఖ రాసి వ్యాక్సిన్లు అప్పగించిన దొంగ!


పొరపాటున కోవిడ్ టీకాలు తస్కరించిన ఓ దొంగ.. తర్వాత వాటిని భద్రంగా పోలీస్ స్టేషన్‌‌కు అప్పగించి పరారయ్యాడు. ఈ ఘటన హరియాణాలోని జింద్‌లో గురువారం చోటుచేసుకుంది. అందులో 1,700 కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోస్‌లున్నట్టు పోలీసులు గుర్తించారు. తస్కరించిన బ్యాగుతో పాటు హిందీలో ఓ నోటు రాసి పెట్టాడు. ‘‘క్షమించండి.. ఇవి కరోనా ఔషధాలని నాకు తెలియదు’’అని రాసిపెట్టి బ్యాగుతో సహా అందజేశాడు. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ బయట ఉన్న టీకా దుకాణం వద్ద ఓ వ్యక్తికి అప్పగించాడు. పోలీసులకు ఆహారం పంపిణీ చేస్తున్నానని, తనకు వేరే పని చేయాల్సిన అవసరం ఉందని ఆ వ్యక్తికి చెప్పి గుర్తుతెలియని నిందితుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. జింద్ సర్వజన ఆస్పత్రిలోని స్టోర్ రూమ్ నుంచి వీటిని నిందితుడు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడి గురించి గాలిస్తున్నారు. యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ అనుకుని పొరపాటున టీకాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రెమ్‌డెసివీర్‌కు భారీ డిమాండ్ ఉండటంతో వాటిని దొంగిలించి సొమ్ము చేసుకోవాలనేది దొంగ అంతరంగమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజువారీ కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సలో సంజీవనిగా భావిస్తోన్న రెమ్‌డెసివిర్‌ ఔషధానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల పలు సంస్థలు ఈ ఔషధం ధరలను దాదాపు 30 శాతం మేర తగ్గించాయి. అలాగే, దీని ఎగుమతులపై కేంద్రం కూడా తాత్కాలిక నిషేధం విధించింది. ఇదిలా ఉండగా, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28న ప్రారంభం కానుంది.


By April 23, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/thief-returns-covid-vaccine-dose-with-note-in-haryanas-jind/articleshow/82208203.cms

No comments