Breaking News

సుప్రీంలో కోవిడ్ కలకలం: సగం సిబ్బందికి పాజిటివ్.. కేసుల విచారణపై కీలక నిర్ణయం


దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వరుసగా ఆరో రోజూ లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే ఇంత పెద్ద సంఖ్యలో రోజువారీ కేసులు నమోదువుతున్నాయి. గడచిన 24 గంటల్లో దాదాపు 1.69 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా.. సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. న్యాయస్థానంలో సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. భారీ సంఖ్యలో సిబ్బందికి కోవిడ్ సోకడంతో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంతో కోర్టు బెంచ్‌లన్నీ సోమవారం ఓ గంట ఆలస్యంగా విచారణను ప్రారంభించనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కేసుల విచారణ 11 గంటలకు వాయిదా పడింది. న్యాయమూర్తులు ఇంటి నుంచే విచారణ చేపట్టనున్నారు. కాగా, శనివారం ఒక్క రోజే 44 మంది సుప్రీంకోర్టు సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది. ‘నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనా బారినపడ్డారు’’ అని ఓ న్యాయమూర్తి తెలిపారు. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా ఆ తర్వాత కోలుకున్నారు. దేశంలో కొన్ని వారాలుగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా మిలియన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. నేడు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. అలాగే, 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


By April 12, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/50-supreme-court-staff-test-positive-hearings-will-now-be-held-via-video-conferencing/articleshow/82026654.cms

No comments