Breaking News

భార్య శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లలేక బోరున విలపించిన వృద్ధుడి .. గుండెల్ని పిండేసే వీడియో


దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభణ వేళ పలు హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుని కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. అయినవారు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రావడంలేదు. కరోనా భయం మనిషిలో మానవత్వాన్ని మంటగలుపుతోంది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ మహిళ చనిపోగా ఆమె కరోనా సోకిందనే భయంతో గ్రామస్తులెవరరూ దరిచేరలేదు. సాయం చేయలేదు సరికదా వృద్ధుడైన భర్త ఆమె మృతదేహాన్ని శ్మశానానికి సైకిల్‌పై తీసుకెళ్తుంటే అడ్డుకున్నారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్‌పూర్‌ జిల్లా అంబేర్‌పూర్‌కు చెందిన రాజ్‌కుమారి (50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి భర్త తిలక్‌ధారి సింగ్ తరలించారు. ఆస్పత్రిలోకి చేరిన కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని గ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. అయితే, ఆమె కరోనా వల్లే చనిపోయిందనే భయంతో గ్రామస్తులు ఎవరూ దగ్గరకు రాలేదు. అంత్యక్రియలకు ఎవరూ సహకరించకపోవడంతో మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. శ్మశానానికి వెళ్లకుండా తిలక్‌ధారి సింగ్‌నూ అడ్డుకున్నారు. అనుమతించేది లేదని గ్రామస్తులు చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయి ఆయన భోరున విలపించాడు. రోడ్డు పక్కనే కొన్ని గంటల అలాగే ఉండిపోయాడు. చివరకు ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు చేరుకుని రామ్‌ఘాట్‌ వద్ద ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు కరోనా నిర్ధారణ కాలేదని అధికారులు తెలపారు. అటు, ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.


By April 29, 2021 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/elderly-man-carries-wifes-body-on-cycle-as-villagers-prevent-cremation-in-uttar-pradesh/articleshow/82303225.cms

No comments