Breaking News

ఓవైపు హిమపాతం.. మరోవైపు వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు


ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, హిమపాతం వరదలకు కారణమయ్యాయి. ఆకస్మిక వరదలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు 291 మందిని సైన్యం రక్షించింది. జోషిమఠ్-మల్నా మధ్య రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఒక్కసారిగా హిమనీనదం ఉప్పొంగడంతో కార్మికులు వరదల్లో చిక్కుకున్నారు. అప్రమత్తమైన సైన్యం సహయాక చర్యలు చేపట్టింది. చమోలీ జిల్లాలోని భాప్‌కుండ్- సుమ్నా మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో వాటిని తొలగించేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. మరో 6-8 గంటల్లో ఈ సహాయక చర్యలు పూర్తవుతాయని ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. శుక్రవారం పర్వత పాదాల వద్ద ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురవగా.. ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం భారీగా కురిసింది. చార్‌ధామ్ పట్టణాలను భారీగా హిమపాతం ముంచెత్తింది. డెహ్రాడూన్‌లో పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ కంటే కనిష్టానికి పడిపోయాయి. ఉత్తర కాశీ జిల్లాల్లోని గంగోతి, యమునోత్రి సహా అనేక ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురవడంతో నదులకు వరద పోటెత్తింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించి, పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.


By April 24, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/flash-floods-due-to-fresh-spell-of-snow-rain-lashes-in-uttarakhand/articleshow/82227541.cms

No comments