Breaking News

17 దేశాలకు వ్యాపించిన భారత్ రకం స్ట్రెయిన్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన


భారత్‌ రకం స్ట్రెయిన్ లేదా డబుల్ మ్యుటెంట్ వైరస్ ‘B.1.617’ ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ స్ట్రెయిన్ వల్లే ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో కరోనా పరిస్థితుల గురించి వారానికి ఒకసారి నిర్వహించే మీడియా సమావేశంలో భాగంగా ఈ వివరాలను డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. భారత్‌లో‘B.1.617’లో... ‘B.1.617.1’, ‘B.1.617.2’, ‘B.1.617.3’ వంటి పలు ఉప రకాలు ఉన్నాయని పేర్కొంది. వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా అవి పుట్టుకొచ్చాయని తెలిపింది. ‘B.1.617.1’, ‘B.1.617.2’ను దేశంలో తొలిసారిగా గత ఏడాది డిసెంబరులో గుర్తించారు. ఏప్రిల్ 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా స్ట్రెయిన్‌లను జన్యు విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో వివరించింది. గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 57 లక్షల కొవిడ్‌ కేసులు బయటపడగా, వాటిలో 38 శాతం ఒక్క భారత్‌లోనే నమోదయ్యాయంది. పాంగో జాతికి చెందిన B.1.617 SARS-CoV-2 వేరియంట్ భారత్‌లో వ్యాప్తిలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. భారత్‌లో రెండో దశ చాలా వేగంగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొంది. ‘‘జీఐఎస్ఐడీకి డబ్ల్యూహెచ్ఓ సమర్పించిన సీక్వెన్స్ ప్రాథమిక మోడలింగ్ ప్రకారం.. భారత్‌లో వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్ల కంటే B.1.617 అధిక వృద్ధి రేటును కలిగి ఉందని సూచిస్తుంది.. ఇది ఇతర వేరియంట్లతో కలిసి మరింత వేగంగా వైరస్ వ్యాప్తిచెందుతుంది’’ అని తెలిపింది. ప్రజారోగ్యం- సామాజిక చర్యలు, ఎన్నికలు సహా సాంస్కృతిక, మతపరమైన వేడుకల సమయంలో సామూహిక సమావేశాలు వైరస్ వ్యాప్తికి దోహదపడ్డాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కారకాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత దర్యాప్తు అవసరని వ్యాఖ్యానించింది. భారత్‌లో గతవారం 52 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఏకంగా 21,72,063 కేసులు నమోదుకాగా.. ఇదే సమయంలో అమెరికాలో 15 శాతం, బ్రెజిల్‌లో 12 శాతం, టర్కీ 9 శాతం, ఫ్రాన్స్ 9 శాతం వంతున కేసులు తగ్గుముఖం పట్టాయి.


By April 29, 2021 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/indian-strain-of-b-1-617-covid-variant-found-in-17-countries-says-who/articleshow/82302705.cms

No comments