Breaking News

‘జాతిరత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: బ్లాక్‌బస్టర్ ఫస్టాఫ్.. కామెడీ పీక్స్!


‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో కడుపుబ్బా నవ్వించడంతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. సుమారు రెండేళ్ల విరామం తరవాత ఇప్పుడు ‘జాతిరత్నాలు’ అనే మరో ఫన్ రైడర్‌తో వచ్చారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ‘జాతిరత్నాలు’ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. నవ్వి నవ్వి కడుపు చెక్కలవడం ఖాయం అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ సినిమా రాలేదని చెబుతున్నారు. వన్ లైన్ పంచ్‌లు అద్భుతంగా పేలాయట. నవీన్ పొలిశెట్టి మరోసారి తన అద్భుతమైన నటనతో కట్టిపడేశారని ప్రశంసిస్తున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని.. సెకండాఫ్ అబౌవ్ యావరేజ్‌గా ఉందని కొంత మంది ఆడియన్స్ ట్వీట్స్ చేశారు. మొత్తంగా ఇది హిట్టు బొమ్మ అని తీర్పు ఇచ్చేశారు. నవీన్, ప్రియదర్శి, రాహుల్.. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుందట. కామెడీ అనేది పవర్‌ఫుల్ జానర్‌ అని ‘జాతిరత్నాలు’ మరోసారి ప్రూవ్ చేసిందని కొనియాడుతున్నారు ఆడియన్స్. మొత్తం మీద నవీన్ పొలిశెట్టి తన ఖాతాలో మరో హిట్టు వేసుకున్నారు. బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయంటున్నారు. తొలిరోజు రూ.7 కోట్ల వరకు వసూలు చేయొచ్చని అంచనా.


By March 11, 2021 at 07:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naveen-polishetty-jathi-rathnalu-twitter-review-and-audience-report/articleshow/81441655.cms

No comments