Breaking News

నో డౌట్.. అనుకున్న తేదీకే ‘ఆచార్య’.. హైదరాబాద్‌లో మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్‌ఫుల్ మెగా ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆచార్య’‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి సరసన కాజ‌ల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. తాజాగా ఖమ్మం షెడ్యూల్‌ను కూడా చిత్ర యూనిట్ పూర్తిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో తాజాగా ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సారథ్యంలో గనుల్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నట్టు చిత్ర నిర్మాతలు బుధవారం వెల్లడించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఖ‌మ్మం షెడ్యూల్‌ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి తిరిగి హైద‌రాబాద్‌లో అడుగుపెట్టాం. చిరంజీవి - చ‌ర‌ణ్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించాం’’ అని తెలిపారు. కాగా, శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోషల్ మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ మూవీగా ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను మే 13న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కానీ, చిరంజీవి షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నారని.. అందువల్ల సినిమా ఆలస్యం అవుతుందని, దీంతో విడుదల తేదీ మారుతుందని రూమర్లు వచ్చాయి. అయితే, ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదు. సినిమా అనుకున్న తేదీకి కచ్చితంగా విడుదలవుతుందని చిత్ర యూనిట్ ఖరారు చేసింది.


By March 10, 2021 at 05:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-acharya-khammam-schedule-wraps-up/articleshow/81431083.cms

No comments