Breaking News

మాజీ ఎమ్మెల్యే మనవళ్ల హత్య.. నిమ్మకాయలు, బొమ్మలు.. భయానకం!


మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మనవళ్లు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆదివారం (మార్చి 7) కనిపించకుండాపోయిన వారి మృతదేహాలు ఊరి పొలిమేరలో లభ్యమయ్యాయి. తాంత్రిక పూజల కోసమే వారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా బల్లతాగి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే హంపయ్య నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాన్వి నియోజకవర్గం నుంచి హంపయ్య నాయక్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మనవళ్లు వరుణ్ (9), సన్నయ్య (5) ఆదివారం తమ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఇళ్లలో గాలించారు. అనంతరం బంధువులు, స్నేహితులతో కలిసి ఊరంతా గాలించారు. అయినా.. ఆచూకీ లభించలేదు. చిన్నారుల ఆచూకీ దొరక్కపోవడంతో హంపయ్య.. పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యం కేసు నమోదు చేసుకొని పోలీసులు వారి కోసం గాలించారు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివార్లలోని చెరువు వద్ద చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. తాంత్రిక పూజల కోసమే తమ పిల్లలను హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే హంపయ్య పోలీసులకు తెలిపారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రాయ్‌చూర్ ఎస్పీని ఆయన కోరారు. మృతదేహాలు లభించిన స్థలంలో నిమ్మకాయలు, బొమ్మలు, చెక్క ముక్కలు ఉన్నాయని హంపయ్య తెలిపారు. అక్కడ ముగ్గులు కూడా వేసి ఉన్నాయని చెప్పారు. సాధారణంగా తాంత్రిక పూజల కోసమే ఇలాంటివి చేస్తారని ఆయన అన్నారు. తమకు శత్రువులెవరూ లేరని హంపయ్య తెలిపారు. మాన్వి ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ మంగళవారం హోంమంత్రి బసవరాజ్‌ను కలిశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని కోరారు.


By March 10, 2021 at 04:51PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/former-mlas-grandchildren-found-dead-in-karnataka-black-magic-suspected/articleshow/81430833.cms

No comments