Breaking News

అధికారి లైంగిక వేధింపులు.. ‘మహారాష్ట్ర లేడీ సింగమ్’ ఆత్మహత్య


తన పనితీరుతో ‘లేడీ సింగమ్’‌గా గుర్తింపు పొందిన యువ అధికారిణి బలవన్మరణానికి పాల్పడటం మహారాష్ట్రలో కలకలం రేగుతోంది. ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె అర్ధాంతరంగా తనువుచాలించింది. మహారాష్ట్రకు చెందిన ఫారెస్ట్ అధికారి (28) గురువారం రాత్రి తన క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకుంది. తనను ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ శివకుమార్ లైంగికంగా వేధించారని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలీ నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాశారు. డిప్యూటీ కన్జర్వేటర్ శివకుమార్ తనను ఎలా లైంగిక వేధింపులకు గురిచేసిందీ పూసగుచ్చినట్టు వివరించారు. ప్రస్తుతం దీపాలీ చవాన్ ఆత్మహత్య లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతి జిల్లా మెల్గాట్‌ టైగర్‌ రిజర్వు (ఎంటీఆర్‌) సమీపం హరిసాల్‌ గ్రామంలోని గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. డేరింగ్ అండ్ డాషింగ్‌తో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్‌ ‘లేడీ సింగమ్‌’గా గుర్తింపు పొందారు. దీపాలీ భర్త రాజేశ్‌ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. దీపాలీ తల్లి శకుంతల ఆమెతోనే ఉంటుండగా.. తన సొంతూరు సతారాకు వెళ్లిన సమయంలో ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య లేఖలో పేర్కొన్న అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌(డీసీఎఫ్‌) వినోద్‌ శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లేఖలో తనపేరు వెల్లడించడంతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శివకుమార్‌ను.. నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డీసీఎఫ్ తనను కొన్ని నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధించడాని వాపోయింది. అతడి ఆగడాలపై పలుమార్లు ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. విధుల్లో ఉండగానే మద్యం సేవించి తనను నోటికొచ్చినట్టు బూతులు తిట్టేవాడని పేర్కొంది. అతడికి లొంగకపోవడంతో తనకు కష్టమైన పనులు చెప్పడం, వేధించడం, జీతం కూడా నిలిపివేశాడని ఆరోపించింది. దీపాలీకి 2020లో వివాహం కాగా.. గర్భవతిగా ఉన్న ఆమెను ఫిబ్రవరి తొలివారంలో మూడు రోజుల పాటు పెట్రోలింగ్‌ ఉందంటూ శివకుమార్‌ తనతో బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లడంతో గర్భస్రావం అయ్యిందని ఓ సన్నిహితురాలు తెలిపారు. గర్భిణి అన్న విషయం తెలిసి కూడా ఆమెను కిలోమీటర్ల దూరం నడిపించి గర్భస్రావానికి కారకుడయ్యాడని, దీంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలీ సూసైడ్ లేఖపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ... అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. అటు, నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్ చేశారు. అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్‌ అరవింద్‌ ఆప్టే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అటు, ఎంటీఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలను మరొకరికి అప్పగించినట్టు ఆప్టే వెల్లడించారు. అంతకు ముందు, నిందితుడిని అరెస్ట్ చేసేవరకూ దీపాలీ మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లబోమని ఆమె కుటుంబసభ్యులు తెగేసి చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగారు. దీంతో బెంగళూరు వెళ్లేందుకు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్ల కిందట ఉద్యోగంలో చేరిన దీపాలీ చవాన్.. నిజాయితీ గల అధికారిణిగా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. రైళ్లో మధ్యప్రదేశ్‌కు పారిపోతున్న అడవి దొంగల ముఠాను తన వాహనంలో వెంబడించి వారిని పట్టుకున్నారు.


By March 27, 2021 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtras-lady-singham-deepali-committ-suicide-accuses-senior-forest-officer/articleshow/81718467.cms

No comments