Breaking News

రికార్ఢ్‌స్థాయిలో కోవిడ్ కేసులు.. వైరస్ ముప్పు తొలగిపోలేదని కేంద్రం హెచ్చరిక


దేశంలో తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత పదిహేను రోజుల నుంచి రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేలకుపైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొద్ది రోజులుగా దేశంలో దక్షిణాఫ్రికా, యూకే కరోనా రకం స్ట్రెయిన్‌ కేసు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,08,856కు చేరింది. కొత్త కేసులు పెరుగుతుండగా.. కోలుకునేవారు సంఖ్య తగ్గిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 15,072 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,09,53,303కి చేరింది. అయితే వారం రోజుల ముందు వరకు 97శాతం దాటిన రికవరీ రేటు.. ప్రస్తుతం 96.86శాతానికి పడిపోయింది. రికవరీలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 2 లక్షలకు చేరువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టివ్‌ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.74శాతానికి పెరిగింది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 119 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,58,343కు చేరింది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో 86 శాతం కేసులు ఉన్నాయి. ఇక, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నిర్ధారణఅవుతున్నాయి. ఆ రాష్ట్రంలో గురువారం కొత్తగా 14,317 మంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22,66,374కు పెరిగింది. అలాగే, మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1.9లక్షల యాక్టివ్ కేసులుండగా.. అందులో లక్షకు పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. దేశంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఏమాత్రం అలసత్వం వహించవద్దని, మహమ్మారి ముప్పు తొలగిపోలేదని హెచ్చరించింది. అంతేకాదు, టీకాలను అందరూ వేయించుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ‘మహమ్మారి వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. ఇది అనుకోకుండా రావచ్చు.. మనం ఈ వైరస్ నుంచి విముక్తి పొందాలంటే తగిన చర్యలు, నియంత్రణ వ్యూహంతో పాటు టీకాలు వేయాలి’ అని అన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న జిల్లాల్లో, అర్హత ఉన్నవారికి టీకాలు వేయడం, ప్రాధాన్యత ఇవ్వాలని వీకే పాల్ సూచించారు. వైరస్ వ్యాప్తి పట్ల ఢిల్లీ, పరిసరాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాజధానిలో పాజిటివిటీ రేటు పెరుగుతోందని, గుర్గావ్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్‌లలో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.


By March 12, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-highest-daily-covid-figure-of-2021-govt-says-pandemic-not-over-yet/articleshow/81461968.cms

No comments