Breaking News

దేశంలో భారీగా కప్పగంతులు.. నాలుగేళ్లలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంపయ్యారంటే?


దేశవ్యాప్తంగా 2016-2020 మధ్య జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ వీడి, పలు పార్టీల్లో చేరినట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. మొత్తం 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్టు తెలిపింది. ఇదే సమయంలో బీజేపీ నుంచి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారని పేర్కొంది. ఆ నాలుగేళ్లలో పార్టీలు మారిన 433 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్పించిన అఫిడవిట్‌లను విశ్లేషించి ఏడీఆర్‌ తాజా నివేదికను విడుదల చేసింది. నాలుగేళ్లలో జరిగిన వివిధ ఎన్నికల్లో తిరిగి పోటీచేసిన 437 మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. వీరిలో 405 మంది ఎమ్మెల్యేల్లో 182 మంది తమ పార్టీలు వీడి బీజేపీలోకి, 38 మంది కాంగ్రెస్‌లోకి, 25 మంది టీఆర్‌ఎస్‌లోకి మారారు. అలాగే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుగురు లోక్‌సభ ఎంపీలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లోకి చేరారు. ఏడుగురు రాజ్యసభ ఎంపీలు 2016-19 మధ్యలో కాంగ్రెస్‌ను వీడారు. మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి ప్రజాప్రతినిధులు పార్టీలు మారడమే కారణమని ఏడీఆర్‌ ఆ నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 53 పార్టీల నుంచి 405 మంది ఎమ్మెల్యేలు 40 ఇతర పార్టీల్లోకి దూకేశారు. వీరిలో 209 మంది తిరిగి గెలుపొందారు. 2016-20 మధ్య మొత్తం 16 మంది రాజ్యసభ సభ్యులు వివిధ పార్టీల నుంచి తిరిగి పోటీచేయగా.. వీరిలో 10 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీల్లో చేరికలకు సంబంధించి టీఆర్ఎస్ (25 మంది) మూడో స్థానంలో నిలిచింది. టీడీపీలోకి 11 మంది, వైఎస్ఆర్సీపీలో ముగ్గురు చేరి పోటీ చేసినట్లు ఏడీఆర్‌ తెలిపింది. విలువలతో కూడిన రాజకీయాలు మాయం కావడం, డబ్బు, అధికారం కోసం పాకులాట, అంగబలం, ఆర్ధికబలం మధ్య బంధం పెనవేసుకుపోవడం, అధికారాన్ని ఆశ చూపడం, సమర్థత, నిజాయతీ, విశ్వసనీయతలతో కూడిన నేతల కొరత, పార్టీల పనితీరుపై చట్టాలు ప్రభావం చూపలేకపోవడం, సీఆర్‌పీసీ సెక్షన్‌ 321 కింద అధికార దుర్వినియోగం (కేసుల్లో ఉన్న వారిని ప్రాసిక్యూషన్‌ నుంచి తప్పించడం) వంటివి కారణమని తెలపింది. కాగా, ఇటీవల కాలంలో ఫిరాయింపుల సంస్కృతిని రాజకీయ పార్టీలు బలంగా ప్రోత్సహిస్తున్నాయి. ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధి.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ప్రలోభాలకు గురిచేస్తూ అధికారంలో ఉన్న పార్టీలు వీరిని ఆకర్షిస్తున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఆ పార్టీలో అసమ్మతి నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటే కారణం.


By March 12, 2021 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/170-mlas-left-congress-to-join-other-parties-between-2016-2020-adr-survey/articleshow/81461301.cms

No comments