Breaking News

నెల రోజులకు కుంభమేళా కుదింపు.. చరిత్రలో తొలిసారి!


దేశంలో కోవిడ్-19 మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చరిత్రలో తొలిసారిగా హరిద్వార్‌ కుంభమేళాను కుదించారు. ఈ మహోత్సవాన్ని నెల రోజులకు పరిమితం చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కుంభమేళాలో పాల్గొనే భక్తులు తప్పకుండా ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. హరిద్వార్‌లో గంగా నదీతీరంలో ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు కుంభమేళా జరగనుందని బుధవారం వెలువరించి ఉత్తర్వుల్లో తెలిపింది. పన్నెండేళ్లకొకసారి జరిగే మహాకుంభమేళాను సాధారణంగా మూడున్నర నెలల పాటు నిర్వహిస్తారు. చివరిసారిగా 2010లో జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ మేళా జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలోనే మేళా సమయాన్ని కుదించినట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులు తప్పనిసరిగా 72 గంటల్లోపు జారీ చేసిన కొవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాసింది. కుంభమేళాలలో పాల్గొంటున్న భక్తులు, సిబ్బందిలో రోజుకు 40 మందికి కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని, టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచాలని సూచించింది. ఏప్రిల్ 12, 14, 27 తేదీల్లో సాహ్నీ స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అలాగే, ఏప్రిల్ 13 ఛైత్రపాడ్యమి, 21న శ్రీరామనవమి రోజున కూడా భారీగా పుణ్యస్నానాలకు భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా ఉంటుంది. శ్రీ మహా విష్ణువు… అమృతాన్ని హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్‌లో ధారపోశారని, ఈ నాలుగు ప్రదేశాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.


By March 26, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/duration-of-kumbh-mela-curtailed-to-one-month-pilgrims-must-show-covid-19-test-report/articleshow/81699264.cms

No comments