Breaking News

ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి.. షాకింగ్ విషయాలు చెప్పిన గ్రామస్థులు


ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతిచెందిన విషాదకర ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సుపాల్ జిల్లా రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాడ్డీ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిశ్రీలాల్ షా, అతడి భార్య, ఇద్దరి కుమార్తెలు, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగుతుంది. ఒకే గదిలో వీరంతా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలు మిస్టరీగా ఉన్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వీరు ఉరేసుకుని చనిపోయారా? మరెవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదుచేశామన్నారు. ఆత్మహత్యకు ఆర్ధిక సమస్యలే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. తొలుత పిల్లలను ఉరేసి, అనంతరం భార్యభర్తలు ఆత్మహత్యచేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. సుపాల్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సైతం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇదిలా ఉండగా, వారి గురించి గ్రామస్థులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రెండేళ్ల కిందట తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన భూమిని అమ్మేసినట్టు తెలిపారు. బొగ్గు వ్యాపారం కూడా చేస్తున్నట్టు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి మిశ్రీలాల్ షా కుటుంబసభ్యులు గ్రామస్థుల ఎవరితోనూ కలవకుండా వేరుగా ఉంటున్నారని తెలిపారు. చివరిసారిగా గత శనివారం వీరిని చూసినట్టు వివరించారు. శుక్రవారం ఆ ఇంటి పరిసరాల్లో దుర్వాసన రావడంతో గ్రామస్థులు అక్కడకు వెళ్లి కిటీకిలో నుంచి చూసేసరికి ఐదుగురూ ఉరికి వేలాడుతున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశామని గ్రామస్థులు పేర్కొన్నారు.


By March 13, 2021 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/five-people-of-same-family-committed-suicide-in-supaul-in-bihar/articleshow/81479741.cms

No comments