Breaking News

లడఖ్‌లో భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన చైనా మాజీ జనరల్‌కు కీలక పదవి!


పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే సైనికాధికారులు, తమకు అనుకూలంగా వ్యవహరించిన ఉన్నతాధికారులకు పదవీవిరమణ తర్వాత చైనా ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టి వారి రుణం తీర్చుకుంటుంది. తాజాగా, తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన మాజీ సైనిక జనరల్‌కు చైనా కీలక పదవిని కట్టబెట్టింది. సీపీఎల్ఏ మాజీ జనరల్ ఝావో ఝాంగ్‌కీని అత్యంత కీలకమైన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో విదేశీ వ్యవహారాల విభాగం డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించింది. చైనా వెస్ట్రన్‌ కమాండ్‌కు అధిపతిగా వ్యవహరించిన ఝూవో.. భారత్‌తో సరిహద్దుల్లో విధులు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే 2017లో డోక్లాం, 2020లో లడఖ్‌ వద్ద భారత్, చైనాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తొలుత 2017లో డోక్లాం వద్ద చైనా సైన్యం రోడ్ల నిర్మాణానికి ప్రయత్నించగా.. భారత్ అడ్డుకోవడంతో వివాదం మొదలయ్యింది. ఈ ప్రతిష్టంభన రెండు నెలలకు పైగా కొనసాగింది. ఆ తర్వాత గత మే తొలివారంలో తూర్పు లడఖ్ వద్ద భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ మొదలయ్యింది. అప్పటి నుంచి తొమ్మిది నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఎల్‌ఏలో అత్యుత్తమ జనరల్స్‌ పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు కావడంతో ఇటీవలే ఆయన పశ్చిమ కమాండ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా ఝావో స్థానంలో జనరల్‌ ఝాంగ్‌ షుడాంగ్‌‌ను నియమించారు. ఆ తర్వాతే పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాలు సైనికులు వెనక్కు మళ్లారు. విదేశీ వ్యవహారాల విభాగానికి డిప్యూటీ ఛైర్మన్‌గా ఝావోను నియమిస్తూ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 5 నుంచి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరగనుండగా.. ఝావోకు కీలక పదవి కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా, ఇటీవల వరకు సాయుధ పోలీసు దళాలకు నాయకత్వం వహించిన మాజీ జనరల్ వాంగ్ నింగ్.. ఎన్‌పీసీ రాజ్యాంగం, న్యాయవిభాగం కమిటీకి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వ్యూహాత్మక దళాల మాజీ రాజకీయ కమిషనర్ జనరల్ జెంగ్ వీపింగ్‌ను ఎన్‌పీసీ విద్య, సైన్స్, కల్చర్ అండ్ ఆరోగ్య కమిటీ డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించారు.


By March 02, 2021 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-appoints-ex-pla-general-to-top-committee-who-headed-troops-along-lac-in-ladakh/articleshow/81286358.cms

No comments