Breaking News

రైతుల ఆందోళనలపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ.. తీవ్రంగా స్పందించిన భారత్


సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల గురించి బ్రిటన్ పార్లమెంట్‌ సభ్యులు చర్చించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఏకపక్షంగా ఉందని, తప్పుడు వాదనలతో నిండిపోయిందని భారత్ మండిపడింది. వెస్ట్‌మినిస్టర్ హాల్‌ చర్చలో పాల్గొన్న 18 మంది బ్రిటిష్ ఎంపీల్లో 17 మంది భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ-పిటిషన్‌కు ప్రతిస్పందనగా వెస్ట్ మినిస్టర్ కమిటీ గదిలో యూకే పార్లమెంటు సభ్యుల బృందం నిర్వహించిన ఒక ఏకపక్ష చర్చను భారత హైకమిషన్ గమనించింది. పిటిషన్‌లో లేవనెత్తిన సమస్యల గురించి సంబంధిత వ్యక్తులకు తెలియజేయడానికి భారత హైకమిషన్ కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. సమతౌల్య చర్చకు బదులు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం, దాని వ్యవస్థల ఆకాంక్షలపై తప్పుడు వాదనలు, అవాస్తవాలు మాట్లాడటం మేము తీవ్రంగా చింతిస్తున్నాం’ అని భారత రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘రైతుల ఆందోళన విషయంలో బ్రిటన్‌లోని భారతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, భారత్‌లోని మైనారిటీలపై దాడులు చేస్తున్నారని సందేహాలు లేవనెత్తడం, ‘కశ్మీర్’లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వంటివి మరోసారి ప్రస్తావించడం ఆందోళన కలిగించే విషయం’ అని అన్నారు. ఇక, ఈ చర్చలో పాల్గొన బ్రిటన్ అధికార కన్జర్వేటివ్, లేబర్ పార్టీకీ చెందిన ఎంపీలు.. రైతుల ఆందోళనపై కఠినంగా వ్యవహరిస్తూ, మీడియాపై ఆంక్షలు విధించి, అంతర్జాల సేవలకు అంతరాయం కలిగిస్తోందని, ఉద్యమకారులను అరెస్ట్ చేస్తోందని ఆరోపించారు. లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జెర్మీ కోర్బైన్ మాట్లాడుతూ.. ఆందోళనలో 25 కోట్ల మంది పాల్గొంటున్నారని, ఇప్పటి వరకూ భూగ్రహం మీద ఏర్పడిన ఇంత పెద్ద పారిశ్రామిక వివాదం ఇదేనని వ్యాఖ్యానించారు. యూకే ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం చర్యలను ఖండించాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ సంతతి ఎంపీ తాహీర్ అలీ డిమాండ్ చేశారు. ‘కేవలం రైతులే కాదు కశ్మీరీ ప్రజల మానవ, పౌర హక్కులను దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు… పత్రికా స్వేచ్ఛ, రాజకీయ అసమ్మతిని దెబ్బతీస్తున్నారు.. విమర్శకులను అరెస్ట్ చేసి, ఇంటర్నెట్ సౌకర్యాలను అడ్డుకుంటున్నారు.. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులపై దాడులతో సహా భారత్‌లో మతపరమైన హింస పెరుగుతుంది’ అని ఆరోపించారు.


By March 09, 2021 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-slams-farm-protest-debate-in-house-of-commons-in-london/articleshow/81406105.cms

No comments