Breaking News

‘కుక్క పోతే సానుభూతి చూపుతారు.. కానీ 250 మంది రైతులు చనిపోయినా’ కేంద్రంపై గవర్నర్ విమర్శలు


సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణాలో బీజేపీ మద్దతు కోల్పోనుందని, ఎందుకంటే నాలుగు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవడం లేదని అన్నారు. ‘ఓ కుక్క చనిపోతే సానుభూతి తెలుపుతారు.. కానీ సాగు చట్టాలపై పోరాటం చేస్తూ 250 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే కనీసం ఒక్కరైనా సానుభూతి తెలపలేదు’అని సత్యపాల్ మాలిక్ అన్నారు. ‘ఒకవేళ రైతుల ఆందోళన సుదీర్ఘకాలం కొనసాగితే పశ్చిమ యూపీ, రాజస్థాన్, హరియాణాలో బీజేపీ మద్దతు కోల్పోతుంది’ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో తాను మాట్లాడుతానని అన్నారు. రైతులను ప్రభుత్వం ఒట్టి చేతులతో పంపదని.. తర్వలోనే వారితో చర్చలు ప్రారంభించనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా వివాదాస్పద ప్రకటనల గురించి ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా దీనిని మాలిక్ కొట్టిపారేశాడు. ‘నేను వారికి హాని చేస్తున్నానని ప్రభుత్వం భావిస్తే నేను తప్పుకుంటాను. నేను గవర్నర్ కాకపోయినా మాట్లాడతాను’ అని ఆయన అన్నారు. ‘ఈ రైతుల దుస్థితిని చూసి నేను భరించలేను.. ప్రజలు ఎమ్మెల్యేలపై దాడి చేయడంతో బీజేపీ నాయకులు తమ గ్రామాలను విడిచి వెళ్లేకపోతున్నారు. ప్రభుత్వానికి హాని చేయాలనుకునేవారు, తీర్మానం కోరుకోనివారికి నా ప్రకటనలు పార్టీకి హాని కలిగించవు.. తమ కోసం ఎవరైనా మాట్లాడుతున్నారని రైతులు భావిస్తారు’ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. ఇటీవల కూడా రైతుల ఆందోళనలపై ఆయన మాలిక్ వ్యాఖ్యలు చేశారు. రైతు రోజు రోజుకూ పేదవాడిగా మారిపోతుంటే.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మూడేళ్లకు ఒకసారి పెరిగి వారు ధనవంతులవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దుచేసింది. దీనిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గోవాకు బదిలీ చేశారు. తర్వాత గతేడాది ఆగస్టులో మేఘాలయ గవర్నర్‌గా నియమించారు.


By March 18, 2021 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/meghalaya-governor-satya-pal-malik-critisizes-centre-on-farmer-protests/articleshow/81561274.cms

No comments