Breaking News

బంగ్లాలో ఆగని హింస: హిందూ ఆలయాలపై దాడులు..10 మందికిపైగా మృతి


బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్ర, శనివారాలు ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించగా..ఈ పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్‌ వాదులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మోదీ సర్కారు హయాంలో భారత్‌లో ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఆరోపిస్తూ.. హిఫాజత్‌-ఎ-ఇస్లాం ఆధ్వర్యంలో వందలాది మంది శుక్రవారం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం అవి తారాస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఎక్కడికక్కడ బస్సులు, రైళ్లకు ఆందోళనకారులు నిప్పటించారు. బంగ్లా తూర్పు ప్రాంతం బ్రాహ్మణ్‌బరియాలో ఓ రైలింజన్‌ను ధ్వంసం చేసి.. బోగీలన్నింటికీ నిప్పంటించిన ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాజ్‌షాహీలో రెండు బస్సులను దగ్ధం చేసి, రహదారులను దిగ్బంధించారు. రాజధాని ఢాకా సహా.. శివార్లు, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. నారాయణ్‌గంజ్‌లో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా.. వారిపై రాళ్లదాడికి దిగారు. దీంతో వారిని చెదరగొట్టడానికి రబ్బరు బుల్లెట్లు, వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. ‘బ్రాహ్మణ్‌బరియా మండుతోంది.. పలు ప్రభుత్వ కార్యాలయాలకు విచక్షణారహితంగా నిప్పంటించారు.. ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పంటించి దాడి చేయడంతో ప్రెస్‌క్లబ్ ఛైర్మన్ సహా పలువురు గాయపడ్డారు’ జావెద్‌ రహీం అనే విలేకరి తెలిపారు. ఈ పట్టణంలోని పలు హిందూ ఆలయాలు సైతం ధ్వంసమయ్యాయి. ఢాకా వీధుల్లో నిరసనకారులు హోరెత్తించారు. విద్యుత్తు స్తంభాలను కూల్చివేసి, టైర్లను కాల్చి రహదారులను దిగ్బంధించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 10 మందికి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఢాకా, చిట్టగాంగ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. దీనికి నిరసనగా హిఫాజత్ -ఎ- ఇస్లాం ఆదివారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిపై పోలీసులే కాల్పులకు తెగబడ్డారని ఆ సంస్థ సెక్రెటరీ అజిజుల్ హక్కీ ఆరోపించారు. మేము మా సోదరులు చింధించిన రక్తాన్ని వృథా కానివ్వం అని వ్యాఖ్యానించారు.


By March 29, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/bangladesh-violence-spreads-after-pm-modi-visit-attacks-on-hindu-temples/articleshow/81741924.cms

No comments