నియంతల పేర్లు ‘M’తోనే ఎందుకు మొదలవుతాయి.. దుమారం రేపుతున్న రాహుల్ ట్వీట్

మార్కోస్, ముస్సోలినీ, ముబారక్, ముషారఫ్.. ఇలా నియంతల పేర్లన్నీ ‘ఎం’ తోనే మొదలవుతాయి ఎందుకు? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్న ఇది. మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ట్విటర్లో మాటలయుద్ధానికి కారణమైంది. వ్యవసాయ చట్టాలు, రైతుల విషయంలో ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ రాహుల్ ఈ స్థాయిలో విమర్శలు చేశారు. ‘నియంతల పేర్లు ‘M’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయి? మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో..’ అంటూ రాహుల్ బుధవారం (ఫిబ్రవరి 3) ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు, కొంత మంది నెటిజన్లు రాహుల్ వ్యాఖ్యలకు దీటుగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ విమర్శించారు. మరికొంత మంది మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ఈ వివాదం మధ్యలోకి తీసుకురావడం గమనార్హం. ‘అసలు ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోదీ. అది ‘ఎన్’తో కదా మొదలయ్యేది..’ అంటూ మరికొందరు రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులకు సంఘీభావంగా రాహుల్ మరో ట్వీట్ చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్న వారి ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేస్తున్నారంటూ రాహుల్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. పోలీసులు మేకులు, బారికేడ్లకు ఏర్పాటు చేయడంపైనా ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పైనా రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పిన విషయం మరిచిపోయిన మోదీ సర్కార్.. దేశ ఆస్తులను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు.
By February 03, 2021 at 04:02PM
No comments