Breaking News

నకిలీ వార్తలపై జోరుగా చర్చ.. ట్విట్టర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు


ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో నకిలీ వార్తలు, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల ద్వారా విద్వేషపూరిత వార్తల వ్యాప్తి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలను తనిఖీ చేసే వ్యవస్థను ఏర్పాటుచేసేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత వినీత్ గొయెంకా గతేడాది మే లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ప్రముఖుల పేరుతో వందలాది నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినా, ఇంత వరకు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా ఖాతాలను రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 1,178కిపైగా ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, డిజిటల్ న్యూస్ కంటెంట్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం ముసాయిదా నియమాలను రూపొందించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం నివేదించడానికి, దానిని తొలగించమని కోరడానికి ఒక విధానం ఉంటుంది. కాగా, సోషల్ మీడియా వేదికలు భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం హెచ్చరించారు. ట్విటర్‌తో ఖాతాల నిలిపివేతపై వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్వేషపూరిత సమాచారాన్ని నిలువరించే విషయంలో కేంద్రం ఆదేశాలు అమలుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


By February 12, 2021 at 12:40PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/twitter-centre-get-supreme-court-notice-on-mechanism-to-check-fake-news/articleshow/80876313.cms

No comments