ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ మంచు చరియలు.. గంగ, అలకనందలకు ఆకస్మిక వరద ముప్పు

ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఆదివారం ఉదయం విరిగిపడ్డాయి. అలకనంద, దౌలిగంగా నదులకు వరద ముప్పు పొంచి ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైనీ గ్రామంలో పవర్ ప్రాజెక్ట్కు నష్టం వాటిళ్లింది. నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 150 మంది గల్లంతయినట్టు తెలుస్తోంది. వారి జాడకోసం శోధిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు, వందలాది మంది ఐటీబీపీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అలకనంద, గంగ పరివాహక ప్రాంతాల్లోని విష్ణుప్రయాగ్, జోషిమఠ్, కర్ణ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్, శ్రీనగర్,రిషికేష్, హరిద్వార్ ప్రజలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దౌలిగంగా నదిలో అమాంతం ప్రవాహం పెరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని, ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పేర్కొన్నారు. అని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ‘మంచు చరియలు విరిగిపడటంతో అలకనంద లోతట్టు ప్రాంతాలకు వరదలు సంభవించే ప్రమాదం ఉంది.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పరీవాహక ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలను తరలిస్తున్నాం’ అని సీఎం వివరించారు. చమోలీ జిల్లా తపోవన్ రైనీ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడటంతో రిషిగంగా పవర్ ప్రాజెక్టుకు నష్టం వాటిళ్లిందని పోలీసులు ట్విట్టర్ వెల్లడించారు. అలకనంద నదిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ముందుగా మేల్కొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా చిక్కుకుంటే, ఏదైనా సహాయం కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ నెంబరు 107 లేదా 955744486కి కాల్ చేయాలని సూచించారు. పాత వీడియోలతో తప్పుడు ప్రచారం చేయవద్దని సీఎం ట్వీట్ చేశారు.
By February 07, 2021 at 01:46PM
No comments