మరోసారి ఉత్తరాఖండ్లో జలప్రళయం.. 150 మంది వరకు మృతి?

ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో విరిగిపడి ఒక్కసారిగా వరదలు ముంచెత్తి మరోసారి జల ప్రళయం సంభవించింది. మంచు ఖండం కరగడంతో కొన్ని ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. జోషీ మఠ్లో ధౌలిగంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో అక్కడ పనిచేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ప్రాణనష్టం 100 నుంచి 150 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. తపోవన్ ప్రాంతంలోని రైనీ గ్రామం వద్ద ఒక సొరంగం లోపల చిక్కుకున్న 16 మందితో రెస్క్యూ బృందాలు సంబంధాలు ఏర్పరచుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అటు ఈ ప్రభావం ఉత్తర్ ప్రదేశ్పై కూడా పడింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గంగా పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాఖండ్లోని నందాదేవి మంచు ఖండం విరిగి, కరిగినట్లు తమకు సమాచారం అందిందని ఉత్తర్ ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. గంగా పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నీటి స్థాయిని నిరంతరం గమనించాలని, అవసరమైతే ప్రజలను మరొక ప్రాంతానికి తరలించాలని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఏసీ ఫ్లడ్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వరద సహాయ కార్యక్రమాలను స్థానికంగా సమన్వయపరచాలని పేర్కొన్నారు. ధౌలిగంగకు భారీ వరదల నేపథ్యంలో రెండు ఐటీబీపీ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. డెహ్రాడూన్ నుంచి భారత వైమానిక దళ హెలికాప్టర్లో మరొక మూడు బృందాలు చేరుకుంటున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగపడే జోషీమఠ్-మలరి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు, ఉత్తరాఖండ్లో పరిస్థితిని కేంద్ర హోం శాఖ నిశితంగా గమనిస్తోంది. ఐటీబీపీ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తోంది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. అవసరమైతే వైమానిక దళం సాయం తీసుకోవాలని సూచించారు. గౌషర్లోని ఐటీబీపీ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరింది. వంతెనల నిర్మాణంలో నిపుణులైన సిబ్బందిని జోషీమఠ్ నుంచి 200 మందిని ఐటీబీపీ పంపించింది.
By February 07, 2021 at 03:07PM
No comments